రేవంత్ మంత్రివర్గంలో ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న ఒకరికి పదవీగండం ముంచుకొస్తున్నది. ఈ నెల 30లోపు ఆయన ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వకపోతే తన మంత్రి పదవీకి రాజీనామా చేయాల్సి ఉంటుంది.ఇప్పట్లో తెలంగాణలో ఎమ్మెల్యే బైపోల్ జరిగే అవకాశం లేదు. అందుకే ఆయన కనీసం ఎమ్మెల్సీగా అయినా ఎన్నిక అవ్వాల్సి ఉంది. లేదంటే రాజ్యాంగంలో పేర్కొన్న రూల్ ప్రకారం మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన ఆరు నెలలలోపు ఏదైనా చట్టసభకు ఎన్నిక అవ్వకపోతే పదవీ పోవడం ఖాయం.దీంతో ఆయన ఎవరా? అని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే, సదరు మంత్రి పదవి సేఫ్గా ఉండాలంటే ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ రాష్ట్ర సర్కారు పంపిన లిస్టును గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది.
రేవంత్ కేబినెట్లో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ ప్రస్తుతం మైనార్టీ వ్యవహారాల మంత్రిగా కొనసాగుతున్నారు. ఈయన చట్టసభలకు ఎంపిక అవ్వలేదు. జూబ్లీహిల్స్ బైపోల్ సమయంలో మైనార్టీ ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు, మైనార్టీలకు మంత్రివర్గంలో చాన్స్ ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నందున ఆయనకు సీఎం రేవంత్ మంత్రి పదవి కట్టబెట్టారు.గతేడాది అక్టోబర్ 30న ఆయన మంత్రిగా ప్రమాణం చేశారు. ఈనెల 30తో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆరునెలలు పూర్తవుతాయి. కానీ, ఆయన ఈలోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక అవ్వాల్సి ఉండగా..ఇంకా కాలేదు. గతంలో అజారుద్దీన్, కోదండరాంలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ సర్కార్ లోక్ భవన్కు ఫైల్ పంపింది. కానీ, దానికి ఇంకా గవర్నర్ ఆమోదం తెలపలేదు.
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గవర్నర్ను కలిసి ఈ విషయం విన్నవించినా ఆయన నుంచి ఆమోదం లభించలేదు. 30వ తేదీలోపు గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే అజారుద్దీన్ తన మంత్రి పదవిని కోల్పోవాల్సి వస్తుంది. ఈలోపు సీఎం రేవంత్ లేదా ప్రభుత్వం తరఫున మంత్రులు గవర్నర్ను కలిసి నామినేటెడ్ ఎమ్మెల్సీలపై నిర్ణయం తీసుకోవాలని కోరుతారా? అనేది తెలియాల్సి ఉన్నది. సర్కారు విజ్ఞప్తిని గవర్నర్ పట్టించుకోకపోతే మంత్రి అజారుద్దీన్ పదవీ పోవడం ఖాయం తెలుస్తున్నది. ఆ తర్వాత ఆయనకు మళ్లీ మంత్రి పదవి ఇస్తారా? లేదా ముందుగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాకే చాన్స్ ఇస్తామని చెబుతారా? అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.
BRS : ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్..ఎత్తులు ఫెయిల్ అయినందుకేనా?
కేరళ, అస్సాం, పుదుచ్చేరి(యూటీ), బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ ఆ ఎన్నికల బిజీలో ఉన్నది. మంత్రులు, సీఎం సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికలు పూర్తయ్యాక వచ్చేనెల రెండో వారంలో రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ ఉండే చాన్స్ ఉన్నది.అప్పుడు మంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళన ఉంటుందని తెలుస్తోంది.ఒకవేళ అజారుద్దీన్ మంత్రి పదవి కోల్పోతే వచ్చే విస్తరణలో ఆయనకు మరల చాన్స్ ఇచ్చి మరోసారి ప్రమాణం చేయిస్తారని కూడా చర్చ జరుగుతోంది.కాగా, దీనిపై కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా స్పందించాల్సి ఉన్నది.