Etala Rajender: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నాయకులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం వల్లే ఈ పరాజయం ఎదురైందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆరు నెలల ముందు నుంచే ఎన్నికల కార్యాచరణ ప్రారంభించాయని ఈటల తెలిపారు. జూబ్లీహిల్స్లో ఓడినంత మాత్రాన బీజేపీ పని అయిపోయిందని మాట్లాడటం సరికాదని అన్నారు. గతంలో హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా అని ఈటల గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 9 ఉప ఎన్నికల్లో 7 సందర్భాల్లో అధికార పార్టీ గెలవగా.. కేవలం రెండింట్లో మాత్రమే బీజేపీ విజయం సాధించిందని ఈటల అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బులు బాగా ఖర్చు పెట్టి దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరుపై విమర్శలు గుప్పించారు. గతంలో కేసీఆర్ చేసిన పనులనే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారని.. ఇద్దరికీ తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ఉపఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ చరిత్రను ఆ పార్టీ నేతలు మర్చిపోకూడదని హితవు పలికారు.
హైదరాబాద్లో పాలనా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని ఈటల రాజేందర్ అన్నారు. నగర జనాభాను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థ, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా చేపట్టాలని అన్నారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి విన్నవిస్తానని తెలిపారు. అలాగే, ఖాళీగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లను పేదలకు వెంటనే కేటాయించాలని.. హైడ్రాలతో పేదల ఇళ్లను కూల్చకుండా చూడాలని కోరుతానని ఎంపీ ఈటల పేర్కొన్నారు.
ఈటల రాజేందర్ చేసిన మరో ముఖ్యమైన వ్యాఖ్య రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణలో విభజన రాజకీయాలతో గెలవలేమని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన తెలిపారు. కులం, మతం ప్రాతిపదికగా ఎక్కడా రాజకీయాలు నిలబడవు అని స్పష్టం చేశారు. అయితే, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హిందువులే టార్గెట్గా ప్రచారం నిర్వహించారని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటు వేస్తే అది ఎంఐఎంకు వేసినట్లే అవుతుందని అన్నారు. ‘మొలదారం లేనోడికే అంత ఉంటే… మొలదారం ఉన్న మనకెంత ఉండాలి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసి, హిందువులంతా బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే.. మతం ప్రాతిపదికన చేసే రాజకీయాలు నిలబడవని ఈటల చేసిన తాజా వ్యాఖ్యలు పరోక్షంగా బండి సంజయ్ ప్రచారాన్ని ఉద్దేశించినవేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో మరోసారి ఈటల, బండి సంజయ్ మధ్య వైరం ముదురుతున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది.
ALSO READ: Ibomma Ravi:రవి వాళ్ల అమ్మ పెద్ద క్రిమినల్… అందుకే వీడు ఇలా… అసలు నిజం బయట పెట్టిన తండ్రి