Tragic Saudi Bus Accident: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ హజ్ కమిటీ సోమవారం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ దురదృష్టకర ఘటనలో మొత్తం 45 మంది యాత్రికులు మరణించినట్లు హజ్ కమిటీ అధికారికంగా ధృవీకరించింది. ఈ ప్రమాదంలో మరణించిన 45 మందీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరవాసులేనని హజ్ కమిటీ స్పష్టం చేసింది. ఈ వార్తతో హైదరాబాద్లో , మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ ప్రమాదం హైదరాబాద్లోని ఒక కుటుంబాన్ని పూర్తిగా ఛిన్నాభిన్నం చేసింది. మృతుల్లో 18 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండటం కన్నీరు పెట్టిస్తోంది. హైదరాబాద్, విద్యానగర్కు చెందిన నసీరుద్దీన్ కుటుంబం ఈ ప్రమాదంలో చిక్కుకుంది. నసీరుద్దీన్తో పాటు ఆయన కుమారుడు, కుమార్తెలు, కోడళ్లు, వారి పిల్లలతో సహా మొత్తం 18 మంది కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
ఈ ఘోర విషాదం నుంచి నసీరుద్దీన్ కుటుంబంలో సిరాజుద్దీన్ ఒక్కరే మిగిలినట్లు సమాచారం. నసీరుద్దీన్ కుమారుడైన సిరాజుద్దీన్, ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటుండటంతో ఈ యాత్రకు వెళ్లలేదు. ఇప్పుడు ఆ కుటుంబంలో అతను ఒక్కడే మిగలడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఈ హృదయ విదారక ఘటన గురించి తెలిసిన వెంటనే, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. హైదరాబాద్-విద్యానగర్లోని నసీరుద్దీన్ నివాసానికి వెళ్లి, వారి బంధువులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నసీరుద్దీన్, ఉమ్మేజా, మణియం ఫాతిమా, SK జైనద్దీన్, మెహరీష్, మహమ్మద్, రిదా తజీన్, ఉజ్జైరుద్దీన్, అక్బర్ బేగం, ఆసిన్ ఫాతిమా, అమీనా బేగం, సారా బేగం, సబానా బేగం, సుబేషా జాఫర్, రిజ్వానా బేగం, సలాఉద్దీన్, ఫరానా సుల్తానా, తాసిమా తహ్రీన్.