వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక కేంద్రమైన పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుండటంతో అక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత ఎన్నికల ఫలితాల ప్రకారం బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ అనూహ్యంగా వరంగల్ ఎంపీ కడియం కావ్య తన ఎక్స్ అఫీషియో ఓటును తొర్రూరు మున్సిపాలిటీలో నమోదు చేసుకోవడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
బలబలాల లెక్కలివే..
తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీతో చైర్మన్ పీఠం తమదే అన్న ధీమాతో ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించింది. సాధారణ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ కావడం ఖాయం. కానీ.. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఎక్స్ అఫీషియో ఓట్లను రంగంలోకి దించింది.
ఎంపీ కావ్య ఎంట్రీతో చెక్!
వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య తన ఎక్స్ అఫీషియో ఓటును ఇక్కడ నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ బలం పెరిగింది. స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎంపీ ఓటు కూడా తోడవడంతో, బీఆర్ఎస్ వద్ద ఉన్న మ్యాజిక్ ఫిగర్కు కాంగ్రెస్ గట్టి పోటీనిస్తోంది. దీంతో ప్రస్తుతం ఇరుపక్షాల బలం సమానంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు ఏకపక్షంగా సాగుతుందనుకున్న చైర్మన్ ఎన్నిక, ఇప్పుడు రసవత్తర పోరాటానికి దారితీసింది.
బీఆర్ఎస్ క్యాంపులో కలవరం – కాంగ్రెస్ ఆఫర్
బీఆర్ఎస్ నుంచి చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’కు తెరలేపింది. ఇప్పటికే బీఆర్ఎస్ కౌన్సిలర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థులకు వైస్ చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చైర్మన్ పీఠం కోసం చిన్న మెజారిటీతో ఉన్న బీఆర్ఎస్ నాయకత్వాన్ని బలహీనపరిచి, ఎలాగైనా ఇక్కడ జెండా పాతాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది.
మున్సిపల్ చైర్మన్ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ, పాలకుర్తి రాజకీయాలు క్లైమాక్స్ సీన్ ను తలపిస్తున్నాయి. ఎక్స్ అఫీషియో ఓట్ల బలం, పదవుల బేరసారాల మధ్య తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.