![](https://bigtvlive.com/wp-content/uploads/2022/10/wines-1.jpg)
Wines Close : మందుబాబులకు ఇది షాకింగ్ న్యూసే. ఒక రోజు వైన్ షాపులు బంద్ చేస్తేనే కొందరు ఆగమాగం అవుతారు. సర్కారు ఖజానా షేక్ అవుతుంది. అలాంటిది ఏకంగా మూడు రోజుల పాటు మద్యం షాపులు క్లోజ్ అవుతుండటం మత్తు దిగే అంశమే. ఇంతకీ ఎందుకీ వైన్స్ బంద్? ఎక్కడ బంద్?
తెలంగాణ వ్యాప్తంగా కాదు.. కేవలం మునుగోడు నియోజకవర్గ పరిధిలోనే వైన్స్ ను మూసేయనున్నారు. నవంబర్ 1 నుంచి 3 వరకు.. ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి. నవంబర్ 1న సాయంత్రం 6 గంటల నుంచి.. 3వ తేదీ సాయంత్రం 6 వరకు వైన్ షాపులు మూసివేయనున్నట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆబ్కారీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, వైన్స్ బంద్ చేసినంత మాత్రాన మందు దొరకదనే భయం మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే కాటన్లకు కాటన్ల సరుకు కొనేశారు పార్టీ నేతలు. ఓటర్లు ప్రత్యేకంగా డబ్బులు పెట్టి మందు కొనాల్సిన అవసరం లేదు. పార్టీ వాళ్లే పిలిచి మరీ తాగినోళ్లకి తాగినంత మద్యం పోస్తున్నారు. మాంసం పంచుతున్నారు. సో.. మూడు రోజుల పాటు వైన్స్ మూసేసినా నో ప్రాబ్లమ్. సీసాలకు సీసాలు సరుకు స్టాక్ ఉందక్కడ..అంటున్నారు.
ఉప ఎన్నిక సందర్భంగా మునుగోడులో మద్యం ఏరులై పారుతోంది. నియోజకవర్గంలోని 7 మండలాల్లో రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్మకాలు జరిగాయి. దాదాపు 28 వేల విస్కీ కాటన్లు, సుమారు 50వేల బీర్ కాటన్లు అమ్మినట్టు లెక్కలు చెబుతున్నాయి. అధికారిక, అనధికారిక మద్యం కలిసి.. 200 కోట్లకు పైగా లిక్కర్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. రికార్డు అమ్మకాలతో మునుగోడు మద్యంలో మునిగి తేలుతోందని అంటున్నారు.
ఇదే అదనుగా అక్రమ మద్యం కూడా భారీగా సరఫరా అవుతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత 2,705 లీటర్ల లిక్కర్, రెండు బైక్లను సీజ్ చేశారు. 48 మందిని అరెస్టు చేశారు. మొత్తం 118 కేసులు నమోదు అయ్యాయి.