Jagadeesh Reddy : మంత్రి జగదీష్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు మునుగోడులో ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధించింది. సభలు, ర్యాలీలు, మీడియా సమావేశాల్లో పాల్గొనకూడదని ఆదేశించింది. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది.
మంత్రి జగదీష్ రెడ్డి ఓటర్లను బెదిరించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయంటూ ఆయన ఓటర్లను బెదిరించినట్టు కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ.. జగదీష్ రెడ్డి మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా రెండు రోజుల పాటు నిషేధించడం సంచలనంగా మారింది.
పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఈసీ నిర్ణయం టీఆర్ఎస్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. మునుగోడు గెలుపు బాధ్యతలు పూర్తిగా మంత్రి జగదీష్ రెడ్డి మీదనే ఉన్నాయి. మొదటి నుంచీ మునుగోడులో అంతా తానై వ్యవహారం చక్కబెడుతున్నారు. అలాంటిది ఇంతటి కీలక సమయంలో జగదీష్ రెడ్డిపై ఈసీ వేటు వేయడం పార్టీ ఓటింగ్ పై ప్రభావం చూపుతుందని అంటున్నారు.
అయితే, కావాలనే బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి.. ఆయనపై నిషేధం విధించేలా ఒత్తిడి తీసుకొచ్చిందంటూ టీఆర్ఎస్ మండిపడుతోంది.