America Road Accident: అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మృతుల్లో నిజామాబాద్ జిల్లా యువకుడు ఉన్నాడు. మొత్తం ముగ్గురు మరణించినట్టు యువకుల కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం అలముకుంది.
అమెరికాలోని ఫ్లోరిడా హైవేలోని బ్రెవార్డ్ కౌంటీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి కాలమాన ప్రకారం ఉదయం 10 గంటలకు జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. పామ్ బేలోని 172వ మైలురాయి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై ఉత్తరం వైపు ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీ కొట్టింది.
ఒక్కసారిగా వాహనంలో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ముగ్గురు యువకులు మృతి చెందారు. ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు నిజామాబాద్ జిల్లా నవీపేట్కు చెందిన రాహుల్ ఉన్నాడు. ఆ ముగ్గురు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం మూడు నెలల కిందట అమెరికా వెళ్లారు . ఫ్లోరిడా అధికారులు ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నారు.
మిగతా ఇద్దరు యువకులు ఏ ప్రాంతానికి చెందినవారు అనేది ఇంకా తెలియాల్సివుంది. ఉన్నత చదువులు కోసం అమెరికా వెళ్లిన కొద్దిరోజులకు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరు అవుతున్నాయి. రాహుల్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు అక్కడివారితో మంతనాలు జరుపుతున్నారు.
ALSO READ: గ్లోబల్ హబ్గా హైదరాబాద్.. ఎన్విడియా వెరా రూబిన్ జీపీయూలతో భారీ ప్రాజెక్ట్!