Thummala Nageswara Rao: ఖమ్మం నగరంలోని 14వ డివిజన్లో రూ. 2.25 కోట్ల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని.. నగరంలోని ప్రతి డివిజన్లో అవసరమైన పనులు చేపడుతున్నామని చెప్పారు. మంజూరైన నిధులను సక్రమంగా వినియోగించి, నాణ్యమైన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యాసంస్థల పరిసరాల్లో గంజాయి విక్రయాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను సహించబోమని మంత్రి హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే నగరంలో కబ్జాలకు పాల్పడే గ్యాంగ్లను పూర్తిగా అరికట్టి, ఖమ్మం నగరానికి దూరం చేస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. అభివృద్ధి పనులు పారదర్శకంగా, ప్రజలకు ఉపయోగపడేలా జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సీసీ రోడ్ల నిర్మాణంతో స్థానికుల రవాణా సమస్యలు తీరుతాయని నగర సౌందర్యం మరింత మెరుగవుతుందని అధికారులు తెలిపారు.