Jangaon District: జనగామ, స్వేచ్ఛ: జనగామ జిల్లాలో పులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. రెండు రోజులుగా జనగామ జిల్లాలో (Jangaon District) పులి అడుగులు కనపిస్తుండటంతో ప్రజలు పరేషాన్ అవుతున్నారు. లేగదూడలను చంపుతూ పులి ముందుకు సాగుతుంది. రెండు రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరించిన పులి (Jangaon District) జనగామ జిల్లాలో ప్రవేశించింది. ఆలేరు మీదుగా జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం మీదుగా జనగామ శివారు ప్రాంతం నుంచి లింగాల ఘన్పూర్ ప్రాంతంలోని కుందారం గ్రామం, దేవరుప్పుల, మండలంలోని కొన్ని ప్రాంతాల నుంచి రఘునాథపల్లి మండలం మండలగూడెం వరకు దాని ప్రయాణం సాగుతుంది. కుందారం గ్రామంలో దాని అడుగు జాడలు కనిపించాయి. శుక్రవారం రఘునాథపల్లి మండలం మండల గూడెంలో పరిశే రాజు అనే రైతుకు చెందిన లేగదూడను చంపిందని ఫారెస్ట్ అధికారులు దృవీకరించారు. పులి ఇటీవల జనగామ జిల్లా కేంద్రానికి సమీపంలోని శామీర్పేట లో ఉన్న వృద్ధాశ్రమం ప్రాంతంలో కూడా సంచరించినట్లు ప్రచారం జరుగుతుంది.
(Jangaon District) జనగామ జిల్లాలో రెండు రోజులుగా సంచరిస్తున్న పులి ఇప్పటి వరకు లేగదూడలనే చంపుతుంది. ఇప్పటి వరకు మనుషుల జోలికి పోలేదు. కేవలం పాదముద్రలను పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది కనిపిడుతున్నారు కానీ నేరుగా ఇప్పటి వరకు పులి ఎవ్వరి కంట కనపడినట్లుగా సమాచారం లేదు. పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది పులిని పట్టుకునేందుకు బృందాలుగా పనిచేస్తున్నా అది ఇంతవరకు దాని జాడ మాత్రం దొరకడం లేదు. సీసీ కెమెరాలను అమర్చినప్పటికి దాని జాడ కనిపించలేదు. డ్రోన్ కెమెరాలతోనూ దాని జాడను వెతుకుతున్నారు. బోన్లు ఏర్పాటు చేసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: East Godavari: తూ.గో జిల్లాలో పెద్ద పులి.. రాత్రంతా పాడుబడిన ఇంట్లోనే.. ఆపరేషన్ టైగర్ షురూ
జనగామ జిల్లాలో తిరుతున్న పులి ప్రయాణం సాగుతూనే ఉంది. మహారాష్ట్ర, ఆదిలాబాద్ లోని కవ్వాల్ ప్రాంతం నుంచి తప్పిపోయిన పులి ఒంటరిగా దారి తెలియక జత లేకపోవడంతో అది ఆగమాగం తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. ఇప్పటి వరకు అది ఆదిలాబాద్ నుంచి పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి జనగామకు వచ్చిందని అంటున్నారు. దానికి తోడు లేకపోవడంతో గాలి గాలి తిరుగుతూ ఉందని, ఆకలి వేసినప్పుడు మాత్రమే అది జంతువులను వేటాడి తింటుందని, రాత్రి, తెల్లవారజాము వేళల్లో అది తిరుగుతుందని, పగటి వేళలలో విశ్రాంతి తీసుకుంటుందని ఫారెస్ట్ అదికారులు వివరించారు. పులి కనిపిస్తే రెచ్చగొట్టే చర్యలకు పోకుండా ఫారెస్ట్, పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా అటవి అధికారి లావణ్య కోరారు.
తప్పనిసరి పరిస్థితులలో తప్ప మిగితా సమయములో బయటికి రాకూడదని, ఒకవేళ అత్యవసరమైన పని ఉన్నచో గుంపు గుంపులుగా వెళ్లవలెనని, రాత్రి సమయములో బయట తిరగకూడదని. రైతులు బావుల వద్ద ఉచ్చులను, కరెంటు వైర్లు అమర్చకూడదని తలిపారు. ప్రస్తుతం అది మండలగూడెం ప్రాంతంలో ఉందని, రాత్రి అయితే దాని ప్రయాణం ముందుకు సాగిస్తుందని సూచించారు. జనగామ జిల్లాలోని జనగామ, రఘునాథపల్లి, నర్మెట్ట, లింగాల ఘన్పూర్, దేవరుప్పుల, తరిగొప్పుల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పులి జాడలు కనిపిస్తే వెంటనే డీ ఎఫ్ ఓ 9440810093, జనగామ ఎఫ్ ఆర్ ఓ 9398946440, రఘునాథపల్లి తహాసీల్ధార్ 9676388123, రఘునాథపల్లి ఎస్సై 8712685211 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్, మల్లన్నసాగర్, గండిరామారం, చీటకోడూరు ప్రాంతాల్లో ఉన్న రిజర్వాయర్లు పెద్దపులికి అనుకూలంగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రిజర్వాయర్లలో నిండుగా నీరు ఉండటం, బ్యాక్ వాటర్ ప్రాంతాల్లో దట్టమైన పొదలు, అడవులు, గుట్టలు ఉండటం పులికి అనుకూలంగా మారనున్నది. రఘునాథపల్లికి అనుకోని ఉన్న ప్రాంతంలోనే రిజర్వాయర్లు అధికంగా ఉన్నాయి. పెద్దపులి నివాసాలకు అది చాలా అనుకూలంగా మారే అవకాశాలు లేకపోలేదని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో పులి ఈ రిజర్వాయర్ల వద్దకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.