తెలంగాణ రాష్ట్రం పదేళ్ల విధ్వంసం నుండి వికాసం దిశగా అడుగులు వేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత కలిగిన నాయకుడని, అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా భావిస్తూ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. గ్లోబల్ సమ్మిట్లో సుమారు 1.70 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకోవడమే సీఎం పనితీరుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
నిజామాబాద్ జిల్లాను విద్యా పరంగా మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లి, దీనిని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా కాంగ్రెస్ మద్దతుదారులు ఇక్కడే సర్పంచులుగా గెలిచారని గుర్తు చేస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయన్నారు.
పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పందిస్తూ.. ఈ వ్యవహారం ప్రస్తుతం గౌరవ స్పీకర్ పరిధిలో ఉందని, స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ వంటి నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారని, సాంకేతికంగా వారు పార్టీ మారలేదని చెబుతున్నారని వివరించారు. చట్టపరమైన ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతాయని ఆయన వెల్లడించారు.
గత ప్రభుత్వ వైఫల్యాలు – ఫోన్ ట్యాపింగ్
నీటి కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కేసీఆర్ ఉదాసీనతే కారణమని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో జీఓలను అత్యంత రహస్యంగా ఉంచేవారని, కానీ తమ ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తూ 90 శాతం జీఓలను పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచిందని తెలిపారు. అలాగే, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ‘ఫోన్ ట్యాపింగ్’ ఒక ఘోరమైన నేరమని, ఈ అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.
ALSO READ: Hyderabad: వారెవ్వా.. హైదరాబాద్లో AI ఉపయోగించి పరీక్షల్లో కాపీయింగ్.. చివరకు సీన్ కట్ చేస్తే..?