Mahesh Kumar Goud: హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ కోసం క్రమశిక్షణతో కష్టపడి పనిచేసే వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయని ఆయన భరోసా ఇచ్చారు. పదవుల కోసం పాకులాడకుండా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మహిళా నేతలకు దిశానిర్దేశం చేశారు.
పదవులు పొందడం ముఖ్యం కాదని.. వాటిని అలంకారప్రాయంగా చూడకుండా బాధ్యతగా స్వీకరించాలని మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు. కేవలం హోదాలకే పరిమితం కాకుండా పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలని కోరారు. రాబోయే రోజుల్లో మహిళలకు చట్టసభలలో అధిక సీట్లు రానున్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవలం రిజర్వేషన్ల కోటా ప్రకారమే కాకుండా.. బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్న మహిళలకు అంతకంటే ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం.. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఈ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి మహిళకు అందేలా చూడాల్సిన బాధ్యత మహిళా కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి పనులను మహిళల్లో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
మహిళా సాధికారతకు కాంగ్రెస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని.. మహిళా నాయకురాళ్లను ప్రోత్సహించడంలో పార్టీ ముందుంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సహా పలువురు ముఖ్య నాయకురాళ్లు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.