Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్ర రవాణా.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉద్యోగులకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రజా పాలన ప్రభుత్వం ఆర్టీసీ సంస్థ పరిరక్షణ.. కార్మికుల సంక్షేమం.. ప్రయాణికుల భద్రతను ప్రాధాన్యతగా తీసుకుని పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం అత్యంత సానుకూల దృక్పథంతో ఉందని.. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ఎవరూ నిరసనలు చేపట్టవద్దని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి.. ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేశామని ఆయన గుర్తు చేశారు. ఈ పథకం విజయవంతం కావడంలో నిరంతరం శ్రమిస్తున్న కార్మికులకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఆర్టీసీని నిర్వీర్యం చేసి.. సంస్థను మూసివేసేలా కుట్రలు పన్నిందని పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఆరోపించారు. తీవ్ర నష్టాల్లో ఉన్న సంస్థను మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చిన ఆదరణతో లాభాల బాటలోకి తీసుకువచ్చామన్నారు. ఈ పథకానికి సంబంధించి ఆర్టీసీకి రావాల్సిన నిధులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తోందని వివరించారు. 2017 నుండి పెండింగ్లో ఉన్న పే స్కేల్ను 21 శాతం ఫిట్మెంట్తో 2024 మార్చి నుండి అమలు చేశామని.. దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి 480 కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నా వెనకాడలేదని చెప్పారు. గత ప్రభుత్వం ఒక్క నియామకం కూడా చేపట్టలేదని.. తమ హయాంలో 3038 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చి.. ప్రస్తుతం 2 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.
ఉద్యోగుల సంక్షేమం కోసం చేపట్టిన ఇతర చర్యలను మంత్రి ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. 1132 కారుణ్య నియామకాలను పూర్తి చేయడమే కాకుండా.. కాంట్రాక్ట్ కాలాన్ని మూడేళ్ల నుండి రెండేళ్లకు తగ్గించి రెగ్యులర్ చేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. 2013 పే స్కేల్ బాండ్ల కింద 280 కోట్లు క్లియర్ చేశామని.. కొత్తగా 2646 బస్సులను కొనుగోలు చేశామని వివరించారు. సీసీఎస్.. పీఎఫ్ బకాయిలను గణనీయంగా తగ్గించామని.. గతంలో ఉద్యోగుల సొమ్మును ప్రభుత్వం వాడుకునే పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు ప్రతి నెలా సీసీఎస్కు 25 కోట్లు.. పీఎఫ్కు 45 కోట్లు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని వివరించారు. ఆర్టీసీని సంక్షోభం నుండి గట్టెక్కించి.. లాభాల్లోకి తెచ్చిన తమ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి.. కార్మికులు తమ నిరసనలు విరమించుకోవాలని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
Read Also: Panchayat Funds: గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. 15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల