ACB Raids: కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో ఎస్సై అనిల్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అనంతపురం పట్టణానికి చెందిన బ్రహ్మం అనే వ్యక్తి నడుపుతున్న ఆటో కన్సల్టెన్సీ ద్వారా విక్రయించిన ఒక బైక్ను, బీహార్కు చెందిన దిలీప్ అనే నిందితుడు చైన్ స్నాచింగ్ నేరాలకు ఉపయోగించాడు. అయితే.. అసలు నిందితుడిని వదిలేసి.. బైక్ అమ్మిన బ్రహ్మంను కేసులో ఇరికిస్తామని పోలీసులు భయపెట్టారు. ఈ కేసు నుండి తప్పించడానికి 8 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా.. చివరికి 2 లక్షలకు బేరం కుదిరింది.
ఏసీబీ ఎంట్రీ..
బాధితుడు బ్రహ్మం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇప్పటికే ఎస్సై అనిల్కు 50 వేల రూపాయలు అందగా.. మిగిలిన మొత్తాన్ని తీసుకుంటుండగా అధికారులు ఆయన్ని పట్టుకున్నారు. విచారణలో.. తాను పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఆదేశాల మేరకే ఈ లంచం తీసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. దీంతో ఏసీబీ అధికారులు లింగాల నుండి పులివెందుల వెళ్తున్న సీఐ వెంకటరమణను మార్గ మధ్యలో అదుపులోకి తీసుకున్నారు.
సోదాల్లో విస్తుపోయే నిజాలు
అనంతరం పులివెందులలోని సీఐ వెంకటరమణ నివాసంలో ఏసీబీ సీఐ నాగరాజ్ ఆధ్వర్యంలో ముమ్మర సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో 20 తులాల బంగారం, కీలక పత్రాలను అధికారులు గుర్తించారు.
ఒక ఆసక్తికర పరిణామంలో.. సోదాలు జరుగుతున్న సమయంలో సీఐ ఇంట్లోని బంగారం, నగదు , పత్రాలను ఒక బ్యాగులో సర్దుకుని బయటకు పారిపోవడానికి ప్రయత్నించిన హోంగార్డు ప్రసాద్ రెడ్డిని ఏసీబీ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రస్తుతం హోంగార్డును కూడా విచారిస్తున్నారు. నేరస్తుడిని పట్టుకోవాల్సిన పోలీసులే.. అమాయకులను బెదిరించి వసూళ్లకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Also Read: వికారాబాద్లో దారుణం.. ప్రాణ స్నేహితుడిని ముక్కలు ముక్కలుగా నరికి..