Real Estate Fraud: ఆలస్యం చేస్తే అశాభంగం అంటూ విస్తృతంగా ప్రచారం చేసి ఫ్లాట్ల పేర కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన త్రిపుర కన్ స్ట్రక్షన్ ఎండీ, డైరెక్టర్ లను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లక్ష్మీగణపతి నిలయం భవనంలో కొన్నేళ్ల క్రితం భార్యాభర్తలైన పసుపులేటి సుగుణ (55), పసుపులేటి సుధాకర్ (58) కలిసి త్రిపుర కన్ స్ట్రక్షన్ పేర రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించారు. దీనికి ఎండీగా సుధాకర్ వ్యవహరిస్తుండగా సుగుణ డైరెక్టర్ గా ఉన్నారు.
కాగా, త్రిపుర నిర్వాణ పేర అపార్ట్ మెంట్ కడుతున్నామని.. తక్కువ ధరకే ఫ్లాట్లు సొంతం చేసుకోండి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీనిని నమ్మిన పలువురు వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు ఫ్లాట్ల కోసం అడ్వాన్సులు చెల్లించారు. ఇలా జనం నుంచి రూ.5.68 కోట్లు వసూలు చేసిన నిందితులు ఏ ఒక్క ఫ్లాట్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేదు.
Also Read: Iran – Israel War: సౌదీపై ఇరాన్ దాడి.. అడ్డంగా బుక్కైన పాక్.. యుద్ధంలోకి దిగక తప్పదా?
గమనించాల్సిన అంశం ఏమిటంటే అపార్ట్ మెంట్ నిర్మాణానికి అనుమతులు కూడా తీసుకోలేదు. డబ్బు కట్టిన వారు ఎప్పుడు ఆఫీస్ కు వచ్చినా అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దీంతో బాధితుల్లో ఒకరైన కొత్తపేట నివాసి వినోద్ సడక్ సీసీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సుధాకర్, సుగుణలను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచి జైలుకు రిమాండ్ చేశారు.