తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కామారెడ్డి పర్యటనకు వెళ్తున్న బీజేపీ కీలక నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు రాష్ట్రంలో అధికార యంత్రాంగానికి విపక్ష నేతలకు మధ్య తీవ్ర ఘర్షణకు దారితీశాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు కామారెడ్డి వెళ్లేందుకు సిద్ధమవ్వగా హైదరాబాద్లోని ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన మండిపడ్డారు. శాంతియుతంగా పర్యటనలు చేస్తుంటే ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు.
మరోవైపు హైదరాబాద్ నుంచి కామారెడ్డికి బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజి రెడ్డిలను మేడ్చల్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. భారీగా మోహరించిన పోలీసులు వారి వాహనాలను ముందుకు వెళ్లకుండా నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి రహదారిపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోలీసులు తమను ఏ ప్రాతిపదికన అడ్డుకుంటున్నారని నిలదీయడంతో అక్కడ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
రోడ్డుపై బైఠాయించిన నేతలను విరమింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే నేతలు ససేమిరా అనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజి రెడ్డిలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. వారిని సమీపంలోని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల చర్యను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో మేడ్చల్ పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అరెస్టులతో భయపెట్టాలని చూడటం సరికాదని బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ALSO READ: TG Panchayat Raj: సుదీర్ఘ నిరీక్షణకు తెర.. పంచాయతీరాజ్లో ప్రమోషన్లు..!