హైదరాబాద్లోని అసెంబ్లీ లాబీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర బడ్జెట్ వినడం అస్సలు ఇష్టం లేదని విమర్శించారు. అందుకే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున సభలో పేపర్లు చింపి గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. బడ్జెట్పై ప్రభుత్వం సమాధానం ఇచ్చే రోజున కావాలనే సభను బహిష్కరించారని ఆరోపించారు. ఆట ముగింపు దశలో ప్రదర్శించాల్సిన వ్యూహాలను ప్రతిపక్షం ఇప్పుడే ప్రదర్శిస్తోందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాయని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఊపందుకున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో లాగే ఇప్పుడు కూడా ఎలాంటి పథకాలు అమలు కాకూడదనేది వారి అసలు ఆలోచన అని దుయ్యబట్టారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగడం వారికి ఏమాత్రం ఇష్టం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకనే సభా సమయాన్ని వృథా చేస్తున్నారని తప్పుబట్టారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి రాజీనామా అంశంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు భట్టి విక్రమార్క స్పందించారు. జీవన్ రెడ్డి రాజీనామా లేఖను తాను ఇంకా చూడలేదని చెప్పారు. ఆ వ్యవహారం గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత విషయాలపై మాట్లాడేందుకు ఆయన సుముఖత చూపలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తూనే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పునరుద్ఘాటించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ: Telangana Assembly: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు, వివరాలన్నీ బయటకు