తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె సెగలు కొనసాగుతున్నాయి. కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) రెండో రోజు పోరాట కార్యాచరణను అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆందోళనలను మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. విధి లేని పరిస్థితుల్లోనే సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని నేతలు స్పష్టం చేశారు. రేపు అనగా ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 5 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోలు, యూనిట్లు, వర్క్ షాపుల ముందు ‘మహాధర్నాలు’ నిర్వహించాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
మొదటి రోజు సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు జేఏసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన చర్చల్లో 32 డిమాండ్ల పైన సుదీర్ఘంగా మాట్లాడినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని వారు గుర్తు చేశారు. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ సైతం సమస్యలు పరిష్కరించలేమని చేతులెత్తేయడం కార్మికుల్లో ఆగ్రహాన్ని నింపింది. దాటవేత ధోరణితో ప్రజలను, కార్మికులను తప్పుదారి పట్టిస్తున్నారని సంఘాల నాయకులు విమర్శించారు.
కార్మికుల ప్రధాన డిమాండ్లలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం అత్యంత ముఖ్యమైనది. అలాగే 2021 వేతన సవరణను కనీసం 30 శాతం తగ్గకుండా తక్షణమే అమలు చేయాలని వారు పట్టుబడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సుల ప్రవేశాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నారు. ఇతర జోన్లకు ఉద్యోగులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించి కార్మిక సంఘాలకు అనుమతినివ్వాలని కోరుతున్నారు.
ప్రభుత్వం మొండి పట్టు వీడి చర్చలు జరపకపోతే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని జేఏసీ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. రేపటి మహాధర్నా కార్యక్రమాల్లో కార్మికులంతా కుటుంబాలతో సహా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హక్కులు సాధించుకునే వరకు పోరాటం ఆగదని జేఏసీ నాయకత్వం తేల్చి చెప్పింది.
ALSO READ: ఆర్టీసీ కార్మికులకు మంత్రి సీతక్క ‘ఆత్మీయ పిలుపు’.. సమ్మె విరమించాలని విజ్ఞప్తి!