RTC Strike: ఆర్టీసీ అనేది ఒక సంస్థ మాత్రమే కాదు, అదొక పెద్ద కుటుంబమని, అందులో పనిచేసే కార్మికులందరూ తన సోదరులని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రస్తుత సమ్మె వల్ల సమస్యలు పరిష్కారం కావని, చర్చల ద్వారానే ఏదైనా సాధ్యమని ఆమె స్పష్టం చేశారు. కార్మికుల ప్రధాన డిమాండ్లయిన ప్రభుత్వంలో విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల వంటి అంశాలపై ఇప్పటికే ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వీటిని సాంకేతికంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే ఉన్నతాధికారుల కమిటీని వేశామని, నాలుగు వారాల్లో నివేదిక రాగానే శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
గత పదేళ్లలో పేరుకుపోయిన సమస్యలు ఒక్కరోజులో పరిష్కారం కావని, ఇది కాలయాపన కాదని ఆమె వివరించారు. ప్రభుత్వం ఇప్పటికే పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిలను క్లియర్ చేసిందని, పీఎఫ్, సీసీఎస్ బకాయిలను కూడా గణనీయంగా తగ్గించామని గుర్తుచేశారు. విలీనం కాకపోయినా ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. కార్మికులపై భారం తగ్గించేందుకు కొత్త నియామకాలు కూడా చేపడుతున్నామని చెప్పారు.
ముఖ్యంగా.. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలు, విద్యార్థులు, పేదలు ఈ సమ్మె వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో సమ్మె వల్ల సంస్థకు ఆర్థిక నష్టం వాటిల్లుతుందని, అది మళ్ళీ కార్మికుల భవిష్యత్తుకే ప్రమాదమని హెచ్చరించారు. గతంలో సమ్మె చేసినప్పుడు జరిగిన నష్టాలను గుర్తుచేస్తూ, మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదన్నదే ప్రభుత్వ తపన అని అన్నారు. ఒక సోదరిగా విజ్ఞప్తి చేస్తున్నానని, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని ఆమె పిలుపునిచ్చారు.
Also Read: నాపై కోవర్ట్ ముద్ర వేస్తారా? దమ్ముంటే విచారణ జరిపించండి.. వర్మకు దొరబాబు ఓపెన్ ఛాలెంజ్!