తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సమ్మె పిలుపు నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ చర్చల ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆర్టీసీ జేఏసీ నేతలను ఉన్నతాధికారులు చర్చలకు ఆహ్వానించారు. కార్మికుల డిమాండ్లను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సచివాలయంలో అన్ని యూనియన్ల నాయకులతో సమావేశమై వారి సమస్యలను విననుంది.
మంత్రి పొన్నం ఏమన్నారంటే..
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సమ్మె పరిష్కారం దిశగా అడుగులు వేయడంతో పాటు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. నిర్ణయాల అమలులో సాంకేతిక కారణాల వల్ల స్వల్ప జాప్యం జరిగే అవకాశం ఉన్నప్పటికీ.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని భరోసా ఇచ్చారు.
కార్మికులు లేవనెత్తిన ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేసేందుకు నలుగురు అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని సర్కార్ రంగంలోకి దించింది. ఆర్టీసీ ప్రతినిధులు తమ విన్నపాలను ఈ కమిటీకి సమర్పించాలని మంత్రి సూచించారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా తాము, ఉప ముఖ్యమంత్రి కలిసి ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఎక్కడా రాజీ పడకుండా ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా నిత్యం 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులపై ఆధారపడి ఉంటారని మంత్రి గుర్తు చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు బస్సు ప్రయాణం ఒక జీవనాధారం వంటిదని అభివర్ణించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత అటు ఉద్యోగుల పైన ఇటు ప్రభుత్వం పైన సమానంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థ మనుగడను కాపాడుకుంటూనే కార్మికుల ప్రయోజనాలను రక్షిస్తామని చెప్పారు.
కార్మిక సంఘాలు ఎలాంటి పట్టింపులకు పోకుండా అధికారుల కమిటీ ముందు తమ గోడును వెళ్లబోసుకోవాలని మంత్రి కోరారు. ప్రభుత్వంపై నమ్మకంతో చర్చలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల శ్రేయస్సు కోరే ప్రభుత్వంగా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. సానుకూల వాతావరణంలో సమస్యను ముగించి ప్రజారవాణా సాఫీగా సాగేలా చూడాలని కోరారు.
కమిటీలో ఎవరెవరు ఉంటారంటే..?
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది సేవా నిబంధనలు ఇతర పెండింగ్ అంశాలను లోతుగా పరిశీలించేందుకు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీలో ఆర్థిక కార్మిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. టీజీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎండీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉద్యోగుల క్షేమమే లక్ష్యంగా అన్ని సమస్యలపై సమగ్ర అధ్యయనం చేపట్టి నాలుగు వారాల గడువులోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Also read: కాళేశ్వరం విచారణపై కేంద్రం డ్రామాలు.. 24 గంటల హామీ ఏమైంది?, బండి సంజయ్పై ఎంపీ చామల ఫైర్