తాము అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దు చేస్తామని ప్రకటించారు కేసీఆర్. ఇప్పుడు దీనిపై చర్చ జరుగుతున్నది. హైడ్రా ఏర్పాటు చేసిన రోజు నుంచే ఇది వార్తల్లోకెక్కింది. పలు వివదాలకే కేరాఫ్ అడ్రస్ అయ్యింది. అయినా సర్కార్ వెనక్కి తగ్గలేదు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ఆకస్మాత్తుగా తెరపైకి వచ్చిన హైడ్రాకు.. అంతా బాగుబాగన్నారు. ఆ తరువాత కొన్ని అక్రమంగా నిర్మించిన అపార్ట్మెంట్ల కూల్చి వేతలతో వార్తల్లోకెక్కింది. పేదల ఇండ్లు ధ్వంసమవుతున్నాయనే ఆవేదన ప్రభుత్వానికి తాకింది. చెరువులను కాపాడినప్పుడు, పూర్వ రూపం తీసుకొచ్చినప్పుడు జనం అబ్బురపడ్డారు. ఓ బతుకమ్మ కుంటకు ప్రాణం పోసినప్పుడు విమర్శకులు కూడా సర్కార్ చర్యను భేష్ అని పొగిడారు. కబ్జాలకు గురైన కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాపాడుకున్నప్పుడు పాలాభిషేకాలు చేశారు. ప్రభుత్వానికి హారతులు పట్టారు. అయినా దీనిపై ప్రతిపక్షం దుమ్మెత్తి పోస్తూనే ఉంది.
తాజాగా కేసీఆర్ నోటి వెంట హైడ్రా మాట రావడం.. దీన్ని రద్దు చేస్తామని ప్రకటించడంతో మళ్లీ ఇది వార్తల్లో కేంద్రబిందువైంది. ఆయనేమన్నారు..? హైడ్రా ద్వారా చెరువులు బాగు చేస్తారట.. అన్ని కూల్చేస్తున్నారు.. మేము చెరువులను బాగు చేయలేదా? అని ఆయన జగిత్యాల బహిరంగ సభ వేదికగా సర్కార్ను ప్రశ్నించారు. అయితే ఇక్కడే ఓ విషయం చెప్పుకోవాలి. హైదరాబాద్లో ఎక్కడా చెరువుల జోలికి కేసీఆర్ సర్కార్ పోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాల వారీగా మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్దరణ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొద్ది రోజులలోనే ఈ మిషన్ కాకతీయ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది కేసీఆర్ సర్కార్.
అయితే ఈ పనులను ఇరిగేషన్ శాఖ ఏళ్ల తరబడి చేస్తున్నవే. కానీ దీనికి కేసీఆర్ సర్కార్ ప్రత్యేకంగా పేరు పెట్టింది. అంతే. దీంతో పాటు ఈ చెరువులో పూడిక తీసిన మట్టిని ఫ్రీగానే రైతుల పొలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసింది. కొంత మంది మాత్రమే దీన్ని వినియోగించుకున్నారు. చెరువు కట్ట బలోపేతం చేయడం, తూముల రిపేరు, రివిట్మెంట్ పనులు.. ఇలా అన్నీ ఇరిగేషన్ శాఖ ఎప్పట్నంచో చేసిందో.. కొత్తగా ఇది తెలంగాణ వచ్చిన తరువాత చేసిన పనులేమీ కావు. కానీ కేసీఆర్ సర్కార్ మాత్రం బాగా ప్రచారం చేసుకోగలిగింది. ఎంతలా అంటే.. అసలు ఈ మిషన్ కాకతీయ ప్రోగ్రామే లేకపోతే చెరువుల అస్థిత్వం కోల్పోయేవని. పూడిక తీసేవాళ్లే లేకుండా పోయేవారని. పూడిక తీత ద్వారా భూగర్భ జలాలు ఆమాంతం పెరిగిపోయాయని. ఈ పనులు చేసిన వారికి బిల్లులు రాక తరువాత చాలా ఏండ్లు చెప్పులరిగేదాకా తిరిగారు. అది వేరే విషయం.
ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే.. గ్రామాల్లో చాలా వరకు చెరువులు కబ్జాలకు గురికావు. పట్టణ, నగర ప్రాంతాల్లోనే ఇవి అధికం. వాటి జోలికి ఏనాడూ కేసీఆర్ సర్కార్ పోలేదు. ఇక హైదరాబాద్ దాని చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల్లో నిజాం కాలంలో తవ్వించిన గొలుసుకట్టు చెరువులున్నాయి. ఇవి ఒక చెరువు మరో చెరువు లింకై ఉండేవి. నగరీకరణ పెరిగిన నేపథ్యంలో ఈ గొలుసు కట్టు చెరువులు చాలా వరకు తమ అస్థిత్వం కోల్పాయాయి. కబ్జాలకు గురై రూపు రేఖలు మారిపోయాయి. ఇక్కడి జాగాకు విపరీతమైన రేటు పెరగడం.. నగర విస్తృతి పెరుగుతూ పోవడం.. రాజధానికి వలసలు పెరగడం.. ఇవన్నీ కారణాలు. వీటి జోలికి కేసీఆర్ ఏనాడూ పోలేదు. ఇప్పుడు హైడ్రా చేస్తుందిదే. అందుకే వివాదస్పదమవుతూ వస్తోంది.
ఏళ్లుగా పాతుకుపోయారు. కోట్లాది రూపాయల విలువగల ఆస్తి కావడంతో ఎవరూ వీటిని వదలి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. చెరువుల జాగాల్లోనే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి కేకుల్లా సర్కార్ స్థలాలను ప్లాట్లుగా చేసి అమ్ముకున్నారు. వీటిల్లో ఇండ్లు, అపార్టెమెంట్లు కూడా వెలిశాయి. ఎఫ్టీఎల్ అనే దానికి ఇక్కడ అర్థమే లేదు. అసలు అక్కడ చెరువుండేదా అన్నట్టుగా ఆనవాళ్లు కోల్పోయి ఉన్నాయి. కుంటలు కుంచించుకుపోయాయి. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కబ్జా కూడా చెరువుదే. చెరువులకు పూర్వవైభవం, కబ్జా చెర నుంచి వీటిని విడిపించడం అనే ప్రధాన లక్ష్యంతోనే హైడ్రా ఏర్పడింది. కానీ కబ్జాల జోలికి పోయిన ప్రతిసారీ వివాదమవుతున్నది. ప్రతిపక్షం దీన్ని రాజకీయ లబ్దికోసం వాడుకోవాలని చూడటంతో హైడ్రాపై కొంచెం నెగిటివ్ ముద్ర పడుతున్నది. ఇక కేసీఆర్ చెప్పిన మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పనులకు, చెరువులకు కబ్జాల చెర నుంచి విముక్తి చేసే హైడ్రాకు మధ్య చాలా తేడా ఉంది. అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నది.