Health Budget: కేంద్ర బడ్జెట్ 2026–27 లో ఆరోగ్య రంగంపై తగినంత ప్రయారిటీ ఇవ్వలేదని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నేషనల్ కో ఆర్డినేటర్ డాక్టర్ కిరణ్ మాదాల వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ పై ఆయన ఆదివారం ప్రత్యేకంగా స్పందిస్తూ…ఇక నుంచి మందుల ధరలు పెరుగుతూనే ఉంటాయన్నారు. కొనుగోలు, స్టాకిస్ట్ , గరిష్ట ధరలపై స్పష్టమైన తేడాను నియంత్రించేందుకు ప్రత్యేక సంస్కరణలేవీ ఇప్పటికీ తీసుకురాలేదన్నారు.
దీనివలన ఔషధాల ధరలపై సరైన నియంత్రణ లేకపోవడం తో నేరుగా రోగులపై భారం పడుతుందన్నారు. తద్వారా సామాన్యులకు చికిత్స అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉన్నదన్నారు. ఇక అండర్గ్రాడ్యుయేట్ ,పోస్ట్గ్రాడ్యుయేట్ సీట్లు సంఖ్యాపరంగా పెరుగుతున్నా..క్వాలిటీ ఎడ్యుకేషన్ అందడం లేదన్నారు. సీట్ల సంఖ్య పెంచుతున్నారే తప్పా..ఫ్యాకల్టీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, వెల్ఫేర్, అడ్మినిస్ట్రేషన్, మెంటరింగ్ అంశాల్లో ఎలాంటి పాలసీలు , నిర్ణయాలు రూపొందచడం లేదన్నారు. కేవలం మెడికల్ కాలేజీలను భవనాలుగా మాత్రమే చూస్తున్నారన్నారు.
ఇక భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న మరణాలలో దాదాపు 75 శాతం నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల వలనే అని తెలిపారు.కానీ ఆయా వ్యాధుల నివారణ, నియంత్రణకు ఆరోగ్య బడ్జెట్లో కేవలం 2 శాతం కన్నా తక్కువ బడ్జెట్ కేటాయించారన్నారు.ప్రభుత్వాల ఆలోచనలు ఇంకా నివారణ కంటే చికిత్స వైపే అడుగులు వేస్తున్నాయన్నారు. ప్రివెంటీవ్ మెజర్స్ పై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నారు. బడ్జెట్లో ప్రజారోగ్యం, జీవనశైలి మార్పులు, ప్రారంభ దశ స్క్రీనింగ్, సమాజస్థాయి నివారణ చర్యలకన్నా ఆసుపత్రి కేంద్రిత ,బీమా ఆధారిత మోడళ్లకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం శోచనీయమన్నారు.
ఆయుష్మాన్ భారత్కు కేటాయించిన బడ్జెట్ చాలా తక్కువగా ఉన్నదన్నారు. ఈ పథకం కింద ఒక్కో పేద వ్యక్తికి సంవత్సరానికి సగటున కేవలం రూ.190 మాత్రమే కేటాయించబడుతోంది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య బీమా ఖర్చుల్లో అత్యల్పమైన వాటిలో ఒకటి అని డాక్టర్ కిరణ్ మాదాల వివరించారు.జీడీపీలో 2.5 శాతం ఆరోగ్య వ్యయం అనే దీర్ఘకాల వాగ్దానం ఇంకా నెరవేరలేదన్నారు. కోవిడ్-19 మహమ్మారి వంటి గాఢమైన పాఠాలు నేర్పినప్పటికీ, భారతదేశంలో ప్రజారోగ్య వ్యయం ఇంకా ప్రపంచ ప్రమాణాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన స్థాయిల కన్నా చాలా తక్కువగానే ఉన్నదన్నారు. ప్రజారోగ్య మౌలిక సదుపాయాల బలోపేతం నుండి ప్రైవేట్–పబ్లిక్ భాగస్వామ్యం మోడల్ వైపు క్రమంగా మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన సమయంలో, విధాన ప్రాధాన్యతలు ప్రైవేట్–ప్రభుత్వ భాగస్వామ్యాల వైపు మళ్లుతున్నాయన్నారు. సరైన నియంత్రణ లేకపోతే ఇది సమానత్వం, బాధ్యత, దీర్ఘకాల స్థిరత్వానికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నదని డాక్టర్ కిరణ్ మాదాల ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Ambati Rambabu: వ్యాఖ్యల తంటా.. రాజమండ్రి సెంట్రల్ జైలుకి అంబటి రాంబాబు, రెండువారాలు అక్కడే