Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో చెక్ డ్యాంలు కూలిపోవడంపై ఆయన తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాంలు కూలిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తనుగుల-గుంపుల వద్ద చెక్ డ్యాం కూలిపోవడం బీఆర్ఎస్ పాలనలో నాణ్యత లోపానికి నిదర్శనం అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యతను గాలికొదిలేయడం వల్ల ఈ దుస్థితి వచ్చిందని బండి సంజయ్ ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ పాలనలో చెక్ డ్యాంలను నిర్మించిన కాంట్రాక్టర్లు కాంగ్రెస్ వాళ్లే అని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన విజిలెన్స్ విచారణ ఏమైందని ప్రశ్నించారు. ఆనాడే బాధ్యులపై చర్యలు తీసుకుని ఉంటే తనుగుల-గుంపుల చెక్ డ్యాం కూలేది కాదని స్పష్టం చేశారు.
తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ డ్రామాలాడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. ఆనాడు కమీషన్లకు కక్కుర్తి పడిన బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఏ ముఖం పెట్టుకుని తనుగుల వస్తున్నారని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చెక్ డ్యాంల నిర్మాణాల్లో అక్రమాలు కూలిపోవడంపై విచారణ జరిపించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యులైన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కాంట్రాక్టర్ల ఆస్తులను జప్తు చేసి ఆ సొమ్ముతోనే మళ్లీ చెక్ డ్యాంలను నిర్మించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.
ALSO READ: BDL Notification: భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు, డోంట్ మిస్