Utham Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం (నవంబర్ 22) హైదరాబాద్లోని జలసౌధలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బోస్ (BOCE) కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ పనులు, నూతన ప్రతిపాదనలపై అధికారులతో మంత్రి చర్చించారు
తుమ్మడిహెట్టి నుంచి 80 టీఎంసీల నీటిని ఏవిధంగా వాడుకోవాలనే అంశంపై చర్చించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తుమ్మడిహెట్టికి సంబంధించి ఎత్తు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరుపాలని ఇంజనీర్లతో కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు. అదేవిధంగా సవరించిన అంచనాల ప్రతిపాదనలు (Revised Estimates), భూసేకరణ (Land Acquisition), పునరావాస (R&R) సమస్యలపై కూడా చర్చ జరిగినట్లు మంత్రి తెలిపారు.
ఈ సమావేశంలో ప్రధానంగా ప్రాజెక్టుల వారీగా ప్రాధాన్యతలను గుర్తించడంపై మంత్రి దృష్టి సారించారు. రాబోయే 6 నుండి 36 నెలల కాలంలో కొత్తగా ఆయకట్టును (Ayacut) అందుబాటులోకి తెచ్చే ప్రాజెక్టుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో పర్యావరణ అనుమతుల అంశాన్ని కూడా ఈ సమీక్షలో మంత్రి పరిశీలించారు.