Vande Bharat Train : వందే భారత్ రైలు తెలుగు రాష్ట్రాల్లోనూ పట్టాలెక్కనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న సికింద్రాబాద్ స్టేషన్లో తెలుగు రాష్ట్రాల తొలి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్- విజయవాడ మధ్య ఈ రైలు నడవనుంది. వందే భారత్ రైలులో సికింద్రాబాద్ నుంచి విజయవాడకు నాలుగు గంటల్లో చేరుకోవచ్చు. ఈ సర్వీసును విశాఖ వరకు పొడిగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
కర్ణాటకలోని కలబురగి నుంచి ప్రధాని హైదరాబాద్ వస్తారు. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. తెలంగాణలో అతిపెద్ద స్టేషన్ సికింద్రాబాద్ను రూ.699 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందాచారు. ప్రస్తుత భవానాలను కూల్చివేస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక వసతులతో కొత్త భవనాలు నిర్మిస్తారు. ఈ నిర్మాణాలు చేసేందుకు కాంట్రాక్టర్ ను అక్టోబర్ లోనే ఎంపిక చేశారు.
దేశంలోని ప్రధాన రైల్వేస్టేషన్లను రైల్వేశాఖ రీడెవలప్మెంట్ చేస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్ స్టేషన్ ను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. దక్షిణ మధ్యరైల్వే జోన్ ప్రధానకేంద్రం సికింద్రాబాద్ లో ఉంది. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి ఎంపీగా సికింద్రాబాద్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్మెంట్ పనులను ప్రారంభించడానికి రావాలని ప్రధాని మోదీని గత నెలలోనే ఆహ్వానించారు. 36 నెలల్లో ఈ పనులు పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నిత్యం 200 రైళ్లు నడుస్తున్నాయి. రోజూ 1.80 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రానున్నరోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2040 నాటికి ఉండే అవసరాలు, రద్దీని తట్టుకునేలా సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళిక రూపొందించారు.