Telangana News: తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పేసింది రేవంత్ సర్కార్. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇకపై కొత్త వాహనం కొనుగోలు చేసేవారికి మరింత తీపి కబురు. రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ- ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా వాహనం కొనుగోలు చేసిన షోరూమ్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకానుంది.
ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
అరచేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం సేవల కోసం ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీన్ని గమనించిన రేవంత్ సర్కార్, టెక్నాలజీతో సేవలను మరింత సులభతరం చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. తెలంగాణ ట్రాన్స్పోర్టుపై ప్రధానంగా ఫోకస్ చేసింది. ఇకపై కొత్త వాహనాలు కొనుగోలు చేసినవారు షోరూమ్ వద్ద రిజిస్ట్రేషన్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది.
కొత్త నిబంధనల ప్రకారం వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ కొనుగోలు చేసిన షోరూమ్లో పూర్తకానుంది. ఇటీవల రవాణా శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్షా సమావేశం జరిగింది. అందులో వాహనాల రిజిస్ట్రేషన్పై ప్రధానంగా చర్చ సాగింది. ఈ మేరకు రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త వాహనదారులు షోరూమ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
డీలర్ల వద్ద కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ అమలుకానుంది. దీనికి అవసరమైన సాఫ్ట్వేర్ మరో రెండువారాల్లో అందుబాటులోకి రానుంది. గతంలో వాహనదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్ను డీలర్ వద్ద చేసుకునేవారు. శాశ్వత రిజిస్ట్రేషన్కి ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లేవారు. అక్కడ ముడుపులు ఇస్తేనే పనులు వేగంగా జరుగుతాయని విమర్శలు ఉండేవి. పరిష్కారంగా దిశగా అడుగులు వేసింది ప్రభుత్వం.
డీలర్ వద్ద కొనుగోలు చేసిన వ్యక్తిగత వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చాలా రాష్ట్రాల్లో కేంద్ర రవాణా శాఖ ఆధ్వర్యంలోని వాహన్, సారథి పోర్టల్ల ద్వారా షోరూంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ పోర్టల్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలను అమలు చేయడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నారు అధికారులు.
ALSO READ: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 36 గంటలపాటు వాటర్ సరఫరా బంద్
షోరూమ్లోని డీలర్ వద్ద రిజిస్ట్రేషన్ కోసం పలు పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటిలో ఇన్వాయిస్ కీలకమైంది. ఆ తర్వాత ఫారం-21 (విక్రయ ధ్రువీకరణ), ఫారం-22 (రోడ్డు అనుకూలత ధ్రువీకరణ), బీమా పత్రం, కొనుగోలుదారుల చిరునామా ధ్రువీకరణ ఉండాలి. దీనికితోడు మరో వాహనం లేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కొనుగోలుదారుల ఫొటో, సంతకం స్కాన్ కాపీ, వాహనం ఇంజిన్, ఛాసిస్ నంబర్ల ఫొటోలు, అవసరం మేరకు రవాణా శాఖ నిర్దేశించే ఇతర పత్రాలు తీసుకుంటారు.
డీలర్ నుంచి వచ్చిన వాహన కొనుగోలుదారుల దరఖాస్తులను రవాణా శాఖ అధికారులు పరిశీలన చేస్తారు. అంతా ఓకే అయితే పత్రాలను ఆమోదిస్తారు. లేకుంటే తిరస్కరిస్తారు. రిజిస్ట్రేషన్ పత్రాన్నిస్పీడ్ పోస్ట్ ద్వారా కొనుగోలుదారుల ఇంటికి పంపిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 3 వేల కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే వాహనదారులకు లబ్ధి చేకూరనుంది. డీలర్ల వద్ద వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేసే అధికారం ప్రభుత్వం తన ఉండనుంది.