Vemulawada Rajanna: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో మనసును కలచివేసే ఒక హృదయ విదారక గాథ వెలుగులోకి వచ్చింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తున్న యాచకులకు అధికారులు నిర్వహించిన కౌన్సిలింగ్లో, ఉన్నత విద్యావంతులైన ఒక దంపతుల దీనస్థితి అందరినీ కంటతడి పెట్టించింది.
వేములవాడ రాజన్న సన్నిధిలో యాచిస్తున్న వారిలో కరీంనగర్కు చెందిన జలంధర్ రెడ్డి, శిరీష అనే దంపతులు ఉన్నారు. జలంధర్ రెడ్డి ఎల్ఎల్బి (LLB) పూర్తి చేయగా, శిరీష బీకాం కంప్యూటర్స్ పూర్తి చేసిన విద్యావంతురాలు. కౌన్సిలింగ్ సమయంలో వారు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తన భార్య ఆరోగ్యం క్షీణించడంతో, ఆమె బాగు కోసం రాజన్న చెంతకు వచ్చామని, ఇక్కడే దొరికిన చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవితం గడుపుతున్నామని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. నేటి కాలంలో చిన్న చిన్న కారణాలకే దంపతులు విడిపోతున్న తరుణంలో, భార్య క్షేమం కోసం సర్వం వదులుకుని అండగా నిలిచిన ఈ భర్త తీరు అక్కడి వారిని భావోద్వేగానికి గురిచేసింది.
వేములవాడలోని రాజన్న ఆలయం, భీమేశ్వర స్వామి, బద్ది పోచమ్మ ఆలయ పరిసరాల్లో సుమారు 100 మందికి పైగా యాచిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది వృద్ధులు కావడం గమనార్హం. తమకు కొడుకులు, కూతుర్లు, ఆస్తులు ఉన్నా.. వారు తమను పట్టించుకోకపోవడంతోనే రాజన్న సన్నిధికి చేరామని పలువురు వృద్ధులు అధికారుల ముందు బోరున విలపించారు. కొందరు ఇంటికాడ పిల్లలు కొట్టి చంపుతారనే భయంతో వస్తే, మరికొందరు ఆదరణ కరువై అనాధల్లా మిగిలిపోయారు. “మాకు ఎవరూ లేకపోయినా ఈ ఎములాడ రాజన్నే సాదుతున్నాడు” అంటూ వారు చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ, ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేయడం నిషేధమని, ఎవరూ యాచించరాదని సూచించారు. కుటుంబ సమస్యల వల్ల బయటకు వచ్చిన వారికి చట్టపరమైన సహాయం అందించి, తిరిగి తమ ఇళ్లకు పంపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వృద్ధులను వేధింపులకు గురిచేసే బంధువులపై కఠిన కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
Read Also: మేడారం వెళ్లలేకపోతున్నారా? ప్రసాదం ఇంటికే.. టీజీఎస్ఆర్టీసీ సరికొత్త సేవలు!