Venkaiah Naidu: విశాఖపట్నం వేదికగా జరిగిన ఒక కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మాతృభాష, సంస్కృతి, భారత ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృభాషను మర్చిపోయిన వాడు మానవుడు కాదని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మాతృభాష కంటి చూపు వంటిదని, ఆంగ్ల భాష కేవలం కళ్లజోడు వంటిదని ఆయన అభివర్ణించారు. కంటి చూపు బాగుంటేనే కళ్లజోడుకు విలువ ఉంటుందని ఆయన గుర్తు చేశారు. తాను ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని, అయితే మాతృభాషకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాఠశాల విద్యలో తెలుగును తప్పనిసరి చేయాలని, ప్రభుత్వ పాలన, గెజిట్లు ప్రజల భాషలోనే ఉండాలని ఆయన కోరారు.
పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించవద్దని, మమ్మీ, డాడీ వంటి పిలుపుల కంటే ‘అమ్మా’ అని పిలవడంలోనే అనురాగం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. సంప్రదాయ దుస్తులు, పద్ధతులను వదిలిపెట్టకూడదని, సంక్రాంతి వంటి పండుగలు పాతను వదిలి కొత్తను స్వీకరించడానికి సంకేతాలని వివరించారు. ఆహారపు అలవాట్లపై మాట్లాడుతూ.. పిజ్జాలు, బర్గర్లు వంటి పాశ్చాత్య ఆహార పదార్థాలు అనారోగ్యానికి హేతువులని, సంప్రదాయ వంటకాలతోనే ఆరోగ్యం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
తన రాజకీయ ప్రస్థానం గురించి చెబుతూ.. ఎమర్జెన్సీ సమయంలో జైలు శిక్ష అనుభవించడం వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని, లేదంటే న్యాయవాది అయ్యేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. కేవలం సరిహద్దుల్లో ఉండటమే కాదని, ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వహించడమే నిజమైన దేశభక్తి అని ఆయన నిర్వచించారు. నదుల ఆక్రమణలపై యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఒకప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’గా అమెరికా విమర్శించినా, నేడు ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని ఐఎంఎఫ్ ప్రకటించడం గర్వకారణమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కన్నతల్లిని, జన్మభూమిని, గురువును ఎన్నటికీ గౌరవించాలని హితవు పలికారు.
Read Also: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్ష సూచన