BRS Leaders: జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు తాటిపర్తి జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన లేదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టబోమని చెప్తూనే, ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. దొంగ కనెక్షన్ల నెపంతో ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తి కాలేదని, రైతు భరోసా, రైతు బీమాను ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఆరోపించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్పై ఆంక్షలు పెట్టే కుట్ర చేస్తున్నారని, జిల్లాలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం సేకరణలో వైఫల్యం.. కొప్పుల ఈశ్వర్
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణలో ఘోరంగా విఫలమైందని, గన్ని సంచులు, లారీల కొరతతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు. జగిత్యాల జిల్లాలో క్వింటాల్కు 7 కిలోల చొప్పున ధాన్యం కోత విధిస్తూ రూ. 83 కోట్లు, హమాలీ చార్జీల పేరిట రూ. 22 కోట్లు.. మొత్తంగా రూ. 107 కోట్ల రైతుల కష్టాన్ని దళారులు, పాలకులు కొల్లగొట్టారని ఆరోపించారు. అలాగే అధికారిక అనుమతులు లేకుండా ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక మాఫియా నడుస్తోందని, ధర్మపురిలో సీజ్ చేసిన రూ. 30 లక్షల విలువైన ఇసుక మాయం కావడం వెనుక మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారం ఉందో లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: పార్టీ మారినోళ్లకు పీటలు.. మాకు అవమానాలా? బీఆర్ఎస్ ఇన్ఛార్జులను నిలదీసిన ఉద్యమకారులు