Gaddam Ananya: ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూతురు గడ్డం అనన్య(24) సరికొత్త చరిత్ర సృష్టించారు. వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికై.. అత్యంత పిన్న వయస్కురాలైన చైర్పర్సన్గా ఆమె రికార్డు సృష్టించారు. సోమవారం జరిగిన పరోక్ష ఎన్నికల్లో వికారాబాద్ మున్సిపాలిటీకి ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వికారాబాద్ మున్సిపాలిటీలోని 17వ వార్డు నుంచి అనన్య కౌన్సిలర్గా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆమెకు 1,138 ఓట్లు లభించాయి.
ఆమె ప్రత్యర్థులైన బీజేపీ, బీఆర్ఎస్, సీపీఎం అభ్యర్థులు కనీసం మూడంకెల ఓట్లను కూడా దాటలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అనన్య తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తానని తెలిపారు. లొయోలా అకాడమీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసిన ఆమె ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు.
పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం అనన్య తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించారు. క్షేత్రస్థాయి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న ఆమె వికారాబాద్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఒక కుమార్తెగా తండ్రికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. వికారాబాద్ పురోగతికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మున్సిపాలిటీలో నెలకొన్న ప్రాథమిక సమస్యల పరిష్కారంపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు ఇంకా ఎందుకు పరిష్కారం కాలేదనే ప్రశ్నలకు ఆమె ధీటుగా సమాధానం ఇచ్చారు. గత పదేళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి సమయం పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం రెండు ఏళ్లు మాత్రమే అయిందని ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం తీరుస్తోందని పేర్కొన్నారు. తమ ప్రాంతంలో ఇటీవల మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత గ్యాస్ పథకాల అమలును ఆమె ఉదహరించారు.
Read Also: Rajya Sabha polls-2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్.. 37 సీట్లకు ఎన్నికలు, తెలంగాణలో రెండు సీట్లకు