Bomb Threat: హై అలర్ట్.. వరంగల్ నగరంలోని జిల్లా కోర్టును మరోసారి బాంబు బెదిరింపులు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కోర్టు ప్రాంగణంలో పేలుడు సంభవిస్తుందని ఆగంతకులు పంపిన ఈమెయిల్ ఒక్కసారిగా యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సమాచారం అందిన వెంటనే స్పందించిన పోలీసులు, కోర్టు విధులను తాత్కాలికంగా నిలిపివేసి, న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రంగంలోకి క్లూస్ టీమ్స్..
బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసులు కోర్టు పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజబుల్ బృందాలు అణువణువూ గాలిస్తున్నాయి. పార్కింగ్ స్థలాలు, రికార్డు గదులు, కోర్టు హాల్స్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. గత నెల 26న కూడా సరిగ్గా ఇలాగే బెదిరింపు మెయిల్ రావడం, తీరా అది తప్పుడు సంకేతం (Fake Mail) అని తేలడంతో, ఈసారి కూడా ఎవరైనా ఆకతాయిలే ఈ పని చేసి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
సైబర్ క్రైమ్ దృష్టి..
వరుసగా కోర్టునే లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ బెదిరింపుల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని కనిపెట్టేందుకు సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగింది. ఈ మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది? ఐపీ అడ్రస్ ఎక్కడ రిజిస్టర్ అయ్యింది? వంటి సాంకేతిక అంశాలను విశ్లేషిస్తున్నారు. న్యాయ వ్యవస్థను భయబ్రాంతులకు గురిచేయడం ద్వారా విచారణలను అడ్డుకోవాలని చూస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పదే పదే ఇలాంటి ఘటనలు జరగడం వల్ల కోర్టు విధులకు ఆటంకం కలగడమే కాకుండా, ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.
Also Read: తెలంగాణలో పర్యాటకులకు గుడ్ న్యూస్.. ఇక హరిత హోటల్స్లో మందు కిక్కు..!
వరుసగా కోర్టునే లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ బెదిరింపులు వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని కనిపెట్టేందుకు సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగింది. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పంపారు అనే కోణంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. న్యాయ వ్యవస్థను సైతం వదలకుండా ఆకాతాయిలు ఇలా చేయడంతో ప్రస్తుత సమాచారం భయబ్రాంతులకు గురిచేస్తుంది.
భద్రత పటిష్టం..
ప్రస్తుతానికి తనిఖీలు కొనసాగుతున్నప్పటికీ, పోలీసులు ముందస్తు జాగ్రత్తగా కోర్టు ప్రాంగణం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అపరిచిత వ్యక్తులు లోపలికి రాకుండా తనిఖీలను ముమ్మరం చేశారు. ఒకవేళ ఇది మునుపటి లాగే ఫేక్ మెయిల్ అని తేలినా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఈ పరిణామాలతో అటు న్యాయవాదులు, ఇటు ప్రజలు తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు.