నదీ జలాల యుద్ధం ముగిసింది.ఎవరైతే నదీ జలాలపై కాంగ్రెస్ పార్టీని సవాల్ చేశారో ప్రజలను తప్పుదోవ పట్టించారో వారే చర్చలో పాల్గొనకుండా వెనక్కితిరిగారు. సర్కార్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వారితో కాలేదని ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.కృష్ణా జలాల కేటాయింపులు, పాలమూరు-రంగారెడ్డి మీద చర్చకు ముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించి సభలో ఎలా మాట్లాడాలో శిక్షణ ఇచ్చారు. అధికార పార్టీ పకడ్బందీగా ప్రిపేర్ అయి వెళ్లగా ప్రతిపక్షం మాత్రం తుస్సుమని జారుకున్నది.
కేసీఆర్ బయటకు వచ్చే వరకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి పెద్దగా చర్చ జరగలేదు. ఆయన బయటకు రావడం.. తెలంగాణకు అధికార కాంగ్రెస్ ద్రోహం చేస్తున్నదని.. చంద్రబాబు కృష్ణా, గోదావరి జలాలను దోచుకుని వెళ్తుంటే నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తుందని.. ఇదే విషయమై పోరాటం చేస్తామని.. కృష్ణా నది పారే మూడు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని అనడంతో సర్కార్ అలర్ట్ అయ్యింది.ఈ మేరకు అసెంబ్లీలో చర్చకు సీఎం రేవంత్.. కేసీఆర్కు సవాల్ విసిరారు. అయితే, గులాబీ బాస్ రాకపోగా ఆయన స్థానంలో హరీశ్ రావు బాధ్యతలు తీసుకున్నారు. మరి ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే ఆయన సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.
రాష్ట్ర రైతులకు సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రాబోయే మూడేండ్లలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే స్పష్టంచేశారు. ఈ టర్మ్లోపు పూర్తి చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్నారు. జూరాల వద్ద ప్రాజెక్టును నిర్మించే తక్కువ వ్యయంతో అయిపోయేదని.. కేసీఆర్ దాన్ని శ్రీశైలం వద్దకు తీసుకుని పోవడం వల్లే ఖర్చు రెట్టింపు అయ్యిందని ఇటీవల సీఎం రేవంత్ వివరించారు. ఖర్చు ఎంతైనా ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని ప్రభుత్వం వెల్లడించింది. ఇక బీఆర్ఎస్ మూడు జిల్లాల్లో సభలు నిర్వహించి ప్రజలను తప్పుదోవ పట్టించుకుండా కాంగ్రెస్ సైతం మహబూబ్ నగర్లో సభ నిర్వహించేందుకు సన్నద్ధం అయ్యింది.
ఈనెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతోంది. బీఆర్ఎస్ నేతల తప్పులు, అవినీతి, కృష్ణా నదీ జలాల్లో కేసీఆర్, హరీశ్ రావు గతంలో చేసుకున్న ఒప్పందాలు, నిధుల వృథా, తప్పిదాలను మహబూబ్ నగర్లో నిర్వహించే సభ ద్వారా రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు వివరించాలని సీఎం రేవంత్ భావించినట్టు సమాచారం. తద్వారా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో వ్యవహరించిన తీరును వివరిస్తూ ఓట్లు అడిగేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. నదీ జలాల్లో తమదే పై చేయి అని.. తప్పు చేశారు కాబట్టే సెషన్స్ను బీఆర్ఎస్ బహిష్కరించిందని ప్రచారం చేసి ఓటర్లను ఆకర్షించాలని పార్టీ జిల్లా మంత్రులు, నేతలకు సూచించినట్టు సమాచారం. సర్పంచ్ ఎన్నికల్లో లాగా ఈసారి ఎక్కడా తప్పు జరగకుండా ప్రతిపక్షం కంటే పైచేయి సాధించాలని అధిష్టానం ఆదేశించినట్టు తెలుస్తున్నది.