Weather Report: రోహిణి రాకముందే రోకళ్లు పగులుతున్నాయి. ఏపీలో టెంపరేచర్ హాఫ్ సెంచరీ టచ్ అవుతోంది. తెలంగాణలో 45 డిగ్రీలు దాటేసింది. ఎండ మండుతోంది. బయటికొస్తే మాడు పగులుతోంది. రోహిణి కార్తె వస్తే ఇంకెలా ఉంటుందో పరిస్థితి. ఈ ఎండ వేడి తగ్గాలంటే.. ఒక్కటే మార్గం. వానలు పడాలి. వానలు పడాలంటే.. రుతుపవనాలు రావాలి. కానీ, ఈసారి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవుతుందని భారత వాతావరణ విభాగం-IMD వాన కబురు వేడిగా చెప్పింది.
అవును, ఈసారి మాన్సూన్స్ లేట్ అవుతాయట. జూన్ 4న కేరళ తీరాన్ని తాకే ఛాన్స్ ఉందట. జూన్ 4 అనేది ఓ అంచనా మాత్రమే. రియల్గా మరింత ఆలస్యమయ్యే అవకాశామే ఎక్కువ. ఈ న్యూసే ఇప్పుడు భగ్గు మంటోంది.
మామూలుగా అయితే జూన్ 1న కేరళను టచ్ చేయాలి నైరుతి రుతుపవనాలు. 2020లో జూన్ 1న, 2021లో జూన్ 3న, 2022లో మే 29 నాటికే కేరళ తీరానికి చేరుకున్నాయి మాన్సూన్స్. కానీ, గతానికి భిన్నంగా ఈసారి సుమారు 4 రోజులు ఆలస్యం కానున్నాయని IMD చెబుతోంది. అంటే, ఈ ఎండలను మరింత కాలం భరించాల్సిందేనా?
ఎందుకు ఆలస్యం అంటే.. ఎల్నినో వల్లే అంటోంది వాతావరణ శాఖ. ఈ పదం వినగానే బెంబేలవుతున్నారు జనం. అసలే ఫుల్ ఎండలు.. ఇక ఎల్నినో కూడా తోడైతే..? వానలు కూడా పడకపోతే..? పరిస్థితి ఇంకెంత అధ్వాన్నంగా ఉంటుందో?
అయితే, అంతగా భయపడాల్సిన పనిలేదంటోంది ఐఎమ్డి. ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పటికీ.. దేశంలో ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పడం కాస్త ఊరట.