BigTV English

Hyderabad Rains Today: కుమ్మేస్తున్న వరుణుడు.. ఇళ్లల్లో ఉండటమే బెటర్, ఈ ఏరియాలు జలమయం

Hyderabad Rains Today: కుమ్మేస్తున్న వరుణుడు.. ఇళ్లల్లో ఉండటమే బెటర్, ఈ ఏరియాలు జలమయం

Hyderabad Rains Today: తెలంగాణలో వర్షాల ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తుండగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. దీంతో వచ్చే రెండు రోజుల పాటు మోస్తరు నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. యాదాద్రి భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ కాగా, రేపటినుంచి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలు కూడా ఈ జాబితాలో చేరనున్నాయి. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చారికలు జారీ చేశారు.


హైదరాబాద్‌లో వర్షం ప్రభావంతో కొన్ని రహదారులు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ORR సర్వీస్ రోడ్డులో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ రాత్రి 9 గంటలకు సర్వీస్ రోడ్డును మళ్లీ మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. డ్రైవర్లు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని సూచించారు.

వర్షాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జలాశయాలు నిండి పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ 24 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండగా, వైరా రిజర్వాయర్ కూడా పూర్తిగా నిండిపోయింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులు నిండిపోవడంతో పంట పొలాలు మునిగిపోయాయి. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాల్లో కుండపోత వర్షం కురుస్తుండటంతో, పాఠశాలలు, ఆసుపత్రుల్లోకి వరదనీరు చేరింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి కూడా నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.


వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చి రవాణాకు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలంలోని మాణిక్యపూర్ వాగు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో కూడా వర్షం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఖైరతాబాద్‌లో పెద్ద చెట్టు రహదారిపై కూలిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. మూసీ నది నీటి మట్టం పెరగడంతో అధికారులు ఐదు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

ఇక హిమాయత్ సాగర్ జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఒక గేటును మూడు అడుగుల మేర పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత ఇన్‌ఫ్లో 750 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 900 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1763.5 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1762 అడుగులుగా నమోదైంది. జలాశయం దాదాపు నిండిపోవడంతో, వరదనీటి ప్రవాహం నియంత్రణ కోసం అధికారులు నీటి విడుదల కొనసాగిస్తున్నారు.

వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు వరద నీటితో మునిగిపోయాయి. వర్ధన్నపేటలో ఆకేరు వాగు పొంగిపొర్లి తహశీల్దార్ కార్యాలయాన్ని నీట ముంచింది. ఆదిలాబాద్, సంగెం మండలాల్లో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం రావడంతో 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మొత్తం మీద, వచ్చే రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు మరింత ముదురే అవకాశం ఉంది. ముఖ్యంగా రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండటం, తక్కువ ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లడం, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Related News

Hyderabad News: గొర్రెల కోసం ఆకులు తెంపడానికి వెళ్లి నాలాలో పడ్డాడు.. చివరకు?

Weather News: అత్యంత భారీ వర్షాలు.. డేంజర్ జోన్‌లో ఈ జిల్లాలు.. బయటకు వెళ్లొద్దు

Telangana politics: కారులో భారీ కుదుపు.. కమలం గూటికి మాజీలు, బీఆర్ఎస్ తర్వాత ప్లానేంటి?

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్! బాంబ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు.. ఎందుకంటే..

Telangana Rains: వర్షాల ఎఫెక్ట్.. ఈ ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

Big Stories

×