CM Revanth Reddy: ప్రధాని నరేంద్ర మోదీ నిరుద్యోగ యువత కోసం ఏటా 2 కోట్ల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి మాట తప్పడాని సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. గుజరాత్, అహ్మదాబాద్ వేదికగా కొనసాగుతున్న ఏఐసీసీ సమావేశాల్లో సీఎం మాట్లాడారు.
‘మహాత్మగాంధీ, వల్లబాయి పటేల్ పుట్టిన గడ్డపై ఏఐసీసీ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మనం చూస్తుంటే.. గాడ్సే ఆలోచనను మోదీ ఎత్తుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సక్సెస్ ఫుల్ గా కులగణన చేశాం. రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేశాం. గాంధేయ వాదులు రాహుల్ గాంధీకి అండగా నిలవాలి. తెలంగాణలో బీజేపీకి స్థానమే లేదు’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ మాట తప్పిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. 10 ఏళ్ల ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో 20 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా..? అని సీఎం నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్ధానాలను ఇంతవరకు అమలు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘దేశాన్ని విభజించాలని మోదీ చూస్తున్నారు. భారతదేశం అంతటా కులగణన చేపట్టాలి. తెలంగాణలో కులగణన పూర్తి చేశాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కి ఇచ్చిన హామీని నెరవేర్చాం. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసి చూపించాం. గాడ్సే సిద్ధాంతాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారు. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టినట్టే బీజేపీని కూడా ఓడించాలి. తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
‘తెలంగాణలో మేం బీజేపీకి అవకాశం ఇవ్వం. గుజరాత్ గడ్డపై నుంచి నేను చెబుతున్నా. మేం నిజాం ప్రభుత్వం కింద ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో మాకు స్వాతంత్య్రం వచ్చింది. అందుకే గుజరాత్ ప్రజలతో, వల్లభాయ్ పటేల్ వారసులతో మా తెలంగాణ ప్రజలకు సంబంధం ఉంది. మాకు స్వాతంత్య్రం ప్రసాదించిన వల్లభాయ్ పటేల్తో మాకు హృదయపూర్వకమైన బంధం ఉంది. మాకు స్వాతంత్య్రం వల్లభాయ్ పటేల్ ఇచ్చారు.. తెలంగాణను మాకు సోనియా గాంధీ అందించింది. వల్లభాయ్ పటేల్ భూమి నుంచి నేను ఒక్కటే చెబుతున్నా.. సోనియా గాంధీ నాయకత్వంలో మేం బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం. బీజేపీని అడ్డుకుంటాం.. వారిని ఎవరూ క్షమించరు’ అని సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు.
‘గాంధీజీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దండి సత్యాగ్రహంతో పాటు 30 ఏళ్ల పాటు అనేక పోరాటాలు చేశారు.. .కానీ బ్రిటిష్వాళ్లు ఎప్పుడూ గాంధీజీ మీద లాఠీ ప్రయోగం చేయలేదు. స్వాతంత్య్రం వచ్చిన ఆరు నెలల్లోనే గాడ్సే వారసులు గాంధీజీపై తుటా పేల్చి ఆయనను హత్య చేశారు. బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు ప్రమాదకారులు. బ్రిటిషర్లను దేశం నుంచి తరిమికొట్టినట్లే రాహుల్ గాంధీ నాయకత్వంలో మనమంతా బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలి. మోదీకి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా సిద్దంగా ఉండాలి. తెలంగాణలో బీజేపీని అడ్డుకునేందుకు, ఓడించేందుకు మేం ఇక్కడి నుంచి ఆశను, ఆదేశాన్ని తీసుకొని వెళుతున్నాం. రానున్న రోజుల్లో బీజేపీని ఓడించే బాధ్యతను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, గాంధీ వారసులు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లాలి’ అని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్ లో నిర్వహించిన ఈ ఏఐసీసీ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, పొన్నం ప్రభాకర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తదితరులు ఉన్నారు.
ALSO READ: CM Revanth Reddy: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై తండ్రి మృతి.. సీఎం రేవంత్ సంతాపం
ALSO READ: NPCIL Recruitment: ఎన్పీసీఐఎల్లో భారీగా ఉద్యోగాలు.. ఇంటర్వ్యూతో జాబ్.. జీతమైతే రూ.74,000