అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు పెద్ద చిక్కొచ్చిపడింది. ప్రస్తుతం వారంతా అమెరికాలో ఎఫ్-1 వీసాలపై ఉంటున్నారు. అలాంటి వీసాలకు అసలు ఏమాత్రం భద్రత లేదని ఇటీవల అందరికీ తెలిసొచ్చింది. ఎఫ్-1 వీసా ఉన్నవారికి యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ICE) ఆమోదించిన కాలేజీలు, యూనివర్శిటీలలో ఫుల్ టైమ్ విద్యార్థులుగా చదువుకునే అవకాశం ఉంది. అయితే ఫస్ట్ ఇయర్ వీరు ప్రత్యేక అనుమతి లేనిదే బయట ఎలాంటి జాబ్ చేయలేరు. అలాంటి అనుమతికోసం ఇచ్చేదే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్. దీని ద్వారా హెచ్-1బి వీసా సులభంగా సాధించవచ్చని అనుకుంటున్నారు విద్యార్థులు. కానీ ఓపీటీ ప్రోగ్రామ్ కి ట్రంప్ సర్కారు మంగళం పాడేందుకు ప్రయ్నిస్తోంది. అమెరికా కాంగ్రెస్ లో కొత్త బిల్లు ప్రవేశ పెట్టింది. ఈ బిల్లు పాసయితే ఓపీటీకి అవకాశం ఉండదు. అంటే చదువు పూర్తయ్యాక వెంటనే అమెరికా నుంచి భారతీయ విద్యార్థులు తిరిగొచ్చేయాల్సిందే.
చదువైపోయాక వెళ్లిపోవాల్సిందే..
భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకోడానికి ఎందుకు వెళ్తారు..? అంతకంటే మంచి యూనివర్శిటీలు ఇక్కడ లేవా..? కచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి. మన ఐఐటీలకంటే మంచి బోధన అక్కడ ఉండదు అని అంటారు చాలామంది. కానీ మన విద్యార్థులు అమెరికా వెళ్లేది అక్కడ స్థిరపడటానికి. చదువుపేరుతో వెళ్లి అక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోయి హెచ్-1 బి వీసా తెచ్చుకుని అక్కడే స్థిరపడేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. ట్రంప్ సర్కారు విదేశీ విద్యార్థుల మెడపై కత్తి పెట్టింది. అమెరికా ప్రజల అవకాశాలను వారు ఎగరేసుకు పోతున్నారనే కారణంతో చదువు అయిపోయిన వెంటనే వారిని బయటకు పంపేయాలని చూస్తోంది. కొన్నాళ్లు అమెరికాలో ఉండేందుకు అవకాశమిచ్చే ఓపీటీ ప్రోగ్రామ్ ని రద్దు చేయాలని చూస్తోంది.
నిర్దాక్షిణ్యంగా వీసాలు రద్దు..
చదువు అయిపోయాక కాదు, ముందుగానే కొంతమందిని సాగనంపేందుకు అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. ఇవి పూర్తిగా కొత్త నిబంధనలేవీ కాకపోయినా, పాతవాటిని పక్కాగా అమలు చేస్తున్నారని అనుకోవాలి. మిదిమీరిన వేగంతో కారు నడిపినా, లైసెన్స్ లేకుండా కారు నడిపినా ఎఫ్-1 వీసాను రద్దు చేసే అవకాశం ఉంది. ఈ నిబంధన అడ్డు పెట్టుకుని ఇప్పుడు వరుసబెట్టి వీసాలు రద్దు చేస్తున్నారు. మార్చి చివరి నుంచి విద్యార్థి వీసాల రద్దు కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ మొదలు పెట్టింది. ఇప్పటి వరకు 150 మందికి పైగా విద్యార్థుల వీసాలు రద్దయ్యాయని తెలుస్తోంది. అయితే ఇలాంటి చిన్న చిన్న కారణాలతో వీసాలు రద్దు చేయడాన్ని భారతీయ విద్యార్థులు అక్కడి కోర్టుల్లో సవాల్ చేస్తున్నారు. వీటి వల్ల ఏమేరకు ప్రయోజనం ఉంటుందో చూడాలి.
వెళ్లకపోతే ఏమవుతుంది..?
ఇటీవల చాలామంది విద్యార్థుల్ని నిర్దాక్షిణ్యంగా వారి వారి సొంత దేశాలకు పంపించేస్తున్నారు అమెరికన్ అధికారులు. ఒకవేళ వారు దేశం విడిచి వెళ్లడానికి ఇష్టపడకపోతే భారీగా జరిమానాలు విధించే ఆలోచనలో ఉన్నారు. వారిని అక్రమ వలసదారులుగా గుర్తించి రోజుకు రూ.86 వేలు జరిమానా కట్టించుకోబోతున్నారు. జరిమానాల చట్టం 1996 నాటిది. దీన్ని 2018లో తొలిసారి అమలు చేశారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రెండోసారి అధ్యక్షపీఠం ఎక్కిన ఆయన, మరోసారి జరిమానాల అస్త్రం బయటకు తీస్తున్నారు.
కిం కర్తవ్యం..?
కోటి ఆశలతో అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థులకు ఇది నిజంగా అశనిపాతం లాంటి వార్తే. ఇప్పటి వరకు బ్రిటన్ కు చదువుకోడానికి వెళ్లేవారు చదువైపోగానే వెనక్కి తిరిగి వచ్చేవారు. అమెరికా వెళ్లిన వారు మాత్రం అక్కడే స్థిరపడిపోతున్నారు. ఇకపై అమెరికాలో కూడా అలాంటి పప్పులేవీ ఉడకవు. ఇఫ్-1 కాలపరిమితి పూర్తయ్యేలోపు హెచ్-1బి వీసా తీసుకోలేకపోతే వారు ఇంటికి రావాల్సిందే. ఒకసారి అలా భారత్ కి తిరిగొచ్చాక, మళ్లీ అమెరికా వెళ్లడం దాదాపు కష్టసాధ్యమేనంటున్నారు.