Naveen Reddy : హైదరాబాద్ మన్నెగూడలో బీడీఎస్ విద్యార్థిని కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. పట్టపగలే 100 మంది యువకులతో వచ్చి యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను ఎత్తుకుపోవడంపై కలకలం రేపింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ‘మిస్టర్ టీ’ఎండీ నవీన్రెడ్డి ఇంకా పోలీసులకు దొరకలేదు. అతడితోపాటు మరో ఇద్దరు నిందితులు రుమాన్, సిద్ధు పరారీలోనే ఉన్నారు. నవీన్ రెడ్డి ఓయో హోటల్ బస చేసి విజయవాడ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు
వ్యాపారం అదుర్స్
నిండా 30 ఏళ్లు వయసు కూడాలేని నవీన్ రెడ్డి మిస్టర్ టీ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించి అనతికాలంలోనే సూపర్ సక్సెస్ అయ్యాడు. వందల దుకాణాలు తెరిచి కోట్లకు పడగలెత్తాడు. నడమంత్రుపు సిరి అతడిని కుదురుగా ఉండనివ్వలేదు. పనిపాట లేని కుర్రాళ్లను తన చుట్టూ తిప్పుకోవడం మొదలుపెట్టాడు. పండగల సమయాల్లో పార్టీలతో హడావిడి చేశాడు. తను అనుకున్నది జరిపోవాలనే తత్వం పెరిగిపోయింది. తనతో పరిచయమున్న బీడీఎస్ విద్యార్థి వైశాలిను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె పెళ్లికి నిరాకరించడంతో ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంటనే అప్రమత్తం కావడంతో ఆ యువతిని వదిలేశాడు.
గతంలోనూ నేర చరిత్ర
నవీన్ రెడ్డి గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. అతనిపై గతంలో మూడు కేసులున్నాయి. 2019లో వరంగల్ కమిషనరేట్ పరిధిలో కేసు నమోదైంది. వరంగల్లో ఇంతెజార్గంజ్ ఠాణాలో ఛీటింగ్, ఐటీ సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. అదే ఏడాది కాచిగూడలో రోడ్డు ప్రమాదం కేసు ఉంది. తనకు వైద్య విద్యార్థినికి వివాహం అయిందంటూ ఆమె పేరిట ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఖాతా తెరిచి.. ఫొటోలు ఉంచడంపై బాధితురాలి ఫిర్యాదుతో రెండు నెలల క్రితం ఆదిభట్ల ఠాణాలో నవీన్రెడ్డిపై ఐటీ చట్టం కింద మరో కేసు నమోదైంది. తాజాగా హత్యాయత్నం, కిడ్నాప్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అతనిపై పీడీ చట్టం ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ ప్రకటించారు.
తొండుపల్లిలో కారు
యువతి కిడ్నాప్నకు నవీన్రెడ్డి ఉపయోగించిన కారును పోలీసులు శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి జడ్పీ పాఠశాల సమీపంలో గుర్తించారు. కిడ్నాప్ అనంతరం పోలీసుల విస్తృత తనిఖీల నేపథ్యంలో నవీన్ యువతిని వదిలేశాడు. కారులో వెళ్తే ఇబ్బంది ఉంటుందన్న ఉద్దేశంతో దాన్ని తొండుపల్లి వద్ద దాచాడు. అప్పటి నుంచి కారు అక్కడే ఉంది. నిందితుడు సమీపంలోని ఓయో హోటల్లో ఒక రాత్రి బస చేసినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న కారులో మహిళ దుస్తులు, మద్యం సీసాలు ఉన్నాయని తెలుస్తోంది. కిడ్నాప్నకు సంబంధించి బాధిత వైద్య విద్యార్థిని స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేయలేదని తెలుస్తోంది. నవీన్రెడ్డి అరెస్టు తర్వాత రికార్డు చేసే అవకాశముంది. మరి పోలీసులు నవీన్ రెడ్డిని ఎప్పుడు పట్టుకుంటారో..