రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతోంది. మొన్నటివరకు సైలెంట్ అయిన విచారణ.. పాత సిట్ స్థానంలో కొత్త సిట్ను సర్కార్ ఏర్పాటు చేయడం.. దానికి నగర సీపీ సజ్జనార్కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంతో విచారణ స్పీడందుకుంది.ఈ క్రమంలోనే ఆయన త్వరగా విచారణ పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వాల్వ్ అయిన మాజీ ఎస్ఐబీ అధికారులు మరోసారి విచారించారు. ఇందులో పెద్దాయన అనే పేరు వినబడినట్టు సిట్ అధికారులు చెబుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా సాక్షిగా విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు సుమారు 7 గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, మీడియా చైర్మన్ శ్రవణ్ రావు, రాధా కిషన్ రావుతో మీకు ఏం సంబంధం? ఎలా పరిచయం? వారితో ఎప్పుడైనా కాల్స్ మాట్లాడారా? వారు ట్యాప్ చేసిన డేటా మీకు ఏమైనా ఇచ్చారా? అందులో మీ ప్రమేయం ఏంటని సిట్ అధికారులు ఆయన్ను విచారించినట్టు తెలిసింది. చివరలో మాజీ అధికారులు ఈ వ్యవహారం అంతా పెద్దాయన అండర్లో జరిగిందని సిట్ అధికారుల ఎదుట స్టేట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం. అయితే, అసలు ఈ పెద్దాయన ఎవరు? మీకు తెలుసా? బీఆర్ఎస్ పార్టీలో ఆ వ్యక్తి ఎవరు? అని హరీశ్ రావును అడిగినట్టు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న సిట్ విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సైతం అధికారులు ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. అసలు మీకు ట్యాపింగ్ కేసుకు సంబంధం ఉందా? సిరిసిల్లలో వార్ రూం ఎందుకు ఏర్పాటు చేశారు? అక్కడ కాంగ్రెస్ నేతల కాల్స్ మీరు విన్నారా? ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల డబ్బును మాత్రమే ఎందుకు పట్టుకున్నారు? మిగతా నేతల డబ్బులు ఎందుకు పట్టుకోలేదు? హీరోయిన్లు, టాలీవుడ్ పెద్దల ఫోన్లు ట్యాప్ చేయమని ఎస్ఐబీ అధికారులకు ఆదేశాలు ఎవరుఇచ్చారు? మీ పార్టీలో ఈ వ్యవహారం అంతా మీకు తెలియకుండానే జరిగిందా? పెద్దాయన ఎవరు? అని ప్రశ్నలు గుప్పించినట్టు సమాచారం.
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు మీకు సన్నిహిత సంబంధం ఉందా? ఆయన ట్యాప్ చేశాక ఆ సమాచారం ఎవరికి ఇచ్చారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయాక డేటాను ఎందుకు ధ్వంసం చేశారు? వారికి ఆదేశాలు ఎవరు ఇచ్చారు? మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది బడా నేతలు ఫోన్లు ట్యాప్ చేశారని ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. ఇక పోతే ప్రస్తుతం గులాబీ పార్టీలో పెద్దాయన అనే పేరుపై తీవ్రంగా చర్చ జరుగుతున్నది. పార్టీ హెడ్ గులాబీ బాస్ కేసీఆర్.. అని బయట ప్రచారం జరుగుతుండగా..అందుకు ఆధారాలు సిట్ దగ్గర లేవు.నాటి సీఎం కేసీఆర్కు తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? అసలు కారకులు కేటీఆర్, హరీశ్ రావు, కేసీఆర్ అని కాంగ్రెస పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.