Nandini Gupta: అందాల సుందరీ హైదరాబాద్ లో అడుగు పెట్టింది. ఈమె విజయం సాధించాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. ఈమె చరిత్ర తెలుసుకుంటే ఔరా అనేస్తారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి తను కన్న కలలను సాకారం చేసుకున్న అందాల భామ ఈమె. అందచందాలతో అందరినీ ఆకట్టుకొనే ఈమె గురించి లోకానికి తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఇంతకు ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో అనుకోవద్దు.. మన దేశం తరపున అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా.
ఎవరు ఈమె?
హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ అందాల పోటీలకు సుమారు 110 దేశాల అందాల భామలు వచ్చేస్తున్నారు. మంగళవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్దకు ఓ అందాల భామ వచ్చిన వెంటనే కెమెరాలు క్లిక్ క్లిక్ మనిపించాయి. ఆమె ఎవరో కాదు నందిని గుప్తా. ఈమె మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో అందరూ ఆప్యాయంగా పలకరించడం మొదలు పెట్టారు. అప్పుడు అందరి మదిలో మెదిలిన ప్రశ్న.. ఈమె చరిత్ర ఏమిటి? ఎందుకింత క్రేజ్ అని.
రాజస్థాన్ అమ్మాయే..
రాజస్థాన్కి చెందిన యువతి నందిని గుప్తా కేవలం 10 ఏళ్ల వయస్సులోనే మిస్ ఇండియా అవ్వాలనే లక్ష్యాన్ని ఎంచుకున్నారు. తన సంకల్పం, పట్టుదలతో ఆ కలను నిజం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ముంబైలో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతోంది. ఆమెకు స్పూర్తి ఎవరో తెలుసా.. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా, బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాలే.
2023లో రికార్డ్
ఫెమినా మిస్ ఇండియా 2023 కిరీటాన్ని గెలిచిన నందిని అప్పట్లో రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు మిస్ వరల్డ్ 2025 పోటీలో భారత్ తరఫున పోటీపడేందుకు సిద్ధమవుతోంది. సంప్రదాయ చీరలో, తెల్లమల్లెలతో హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టిన నందిని, తన లుక్స్ తో అందరి మనసులు దోచుకుంది. ఈమె కోటాలోని సెయింట్ పాల్స్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదివారు. ప్రస్తుతం ముంబైలోని లాలా లజ్పత్ రాయ్ కాలేజీలో బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీను అభ్యసిస్తున్నారు.
ఈమె గురించి తెలియని రహస్యాలు..
నందిని గుప్తా ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. పదేళ్ళ వయస్సులో మిస్ ఇండియా కావాలని కలలు కని, 19 ఏళ్ల వయస్సులో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రాజెక్ట్ ఏక్తా అనే సంస్థతో సమాజ సేవ సాగిస్తున్నారు ఈమె. మనిషికి చేసే సాయంలోనే భగవంతుడు కొలువై ఉన్నారన్నది ఈమె అభిమతం. అందుకే కాబోలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ, శభాష్ నందిని గుప్తా అనిపించుకుంటున్నారు.
అంతేకాదు కోటాలో ప్రసిద్ధి చెందిన కోటా దోరియా వస్త్రాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నందిని ముందుకు వచ్చారు. స్థానిక హస్తకళాకారులకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేశారు. ఢిల్లీ యూనివర్శిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ చదివిన నందిని, అకడెమిక్గా కూడా మంచి స్కోరులతో ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ అయింది.
ఇన్స్టాగ్రామ్లో లక్షలాది ఫాలోవర్స్ ఉన్న నందిని, ఫ్యాషన్, మైండ్ఫుల్నెస్, మహిళా శక్తీకరణపై కంటెంట్ షేర్ చేస్తూ యువతతో బలమైన కనెక్ట్ ఏర్పరచుకుంటోంది. ఆమె బ్యూటీ వెనుక పెద్ద కారణం డెడికేటెడ్ ఫిట్నెస్ రూటిన్. రోజూ యోగా, పిలాటెస్, డ్యాన్స్తో పాటు హెల్తీ డైట్ పాటిస్తుందట. రాజస్థాన్కు చెందిన నందిని, పుష్కర్, జైపూర్ వంటి ప్రాంతాల సంస్కృతిని బాగా ప్రేమిస్తుంది. ఆమె ఆ భాష, పద్ధతులను ప్రదర్శించేలా తన డ్రెస్సింగ్ స్టైల్లో చూపించడమూ ప్రత్యేకతే.
Also Read: History of Karachi Biscuits: కరాచీ బేకరి పాకిస్తానీదా? ఆ పేరు ఎలా వచ్చింది?
మిస్ వరల్డ్ 2025 అయ్యేనా?
మిస్ వరల్డ్ 2025 అయ్యే అన్నీ అర్హతలు నందిని గుప్తాకు ఉన్నాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది. హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఈ అందాల భామకు అదిరే స్వాగతం లభించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోటీలు కావడంతో, తెలంగాణ అద్భుతాలను దగ్గర నుండి చూసే అవకాశం రావడం గర్వంగా ఉందని అందాల ముద్దుగుమ్మ నందిని గుప్తా చెప్పుకొచ్చారు. మొత్తం మీద నందిని గుప్తా విజేతగా నిలవాలని అందరూ కోరుకుంటున్నారు. మరి ఆ విజయాన్ని అందుకుంటే నందిని గుప్తా కల పూర్తి స్థాయిలో సాకారమైనట్లే.