Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలైన తొలి క్షణం నుంచే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తొలి రెండు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వల్ప ఆధిక్యం కనబరిచినా, మూడో రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత స్వల్ప ఆధిక్యంతో పోటీని మరింత రసవత్తరంగా మార్చారు. ప్రస్తుతం, మొత్తం ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. దీంతో నవీన్ యాదవ్ గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో మొదటి రెండు రౌండ్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా షేక్ పేట డివిజన్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించడం ఆ పార్టీకి బలాన్ని చేకూర్చింది. షేక్ పేటలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉండటంతో.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా కాంగ్రెస్కే ఎక్కువ ఆధిక్యం లభించడం ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు కలిసొచ్చింది.
అయితే..ఉదయం 10 గంటల సమయానికి పూర్తైన మూడో రౌండ్లో సమీకరణాలు కాస్త మారాయి. ఈ రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 12,503 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 12,292 ఓట్లు దక్కించుకున్నారు. ఫలితంగా, మూడో రౌండ్లో బీఆర్ఎస్కు స్వల్ప ఆధిక్యం లభించింది. అయినప్పటికీ, ఓవరాల్గా ఆధిక్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందుండటం గమనార్హం.
తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. రాష్ట్రంలో అధికార మార్పు తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నిక కావడంతో.. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుకు ఒక అగ్నిపరీక్షగా నిలుస్తోంది. మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది.
మూడో రౌండ్లో బీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యం సాధించడం ఈ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారుస్తోంది. కీలకమైన ఈ రణరంగంలో గెలిచేదెవరు అనే విషయం తెలుసుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తదుపరి రౌండ్లలో ఈ ఆధిక్యం ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుందో, చివరకు జూబ్లీహిల్స్ కిరీటం ఎవరికి దక్కుతుందో మరికొన్ని గంటల్లో తేలనుంది.