Yadadri District: ఒకవైపు.. సంతానం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ.. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, దేవుళ్లకి మొక్కులు చెల్లించుకుంటూ కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూసే దంపతులు. మరోవైపు.. పుట్టిన పసికందును అక్కున చేర్చుకోవాల్సింది పోయి.. కనికరం లేకుండా చెత్తకుప్పల్లోనో, నిర్మానుష్యమైన రోడ్ల పక్కనో వదిలేస్తున్న కన్నప్రేమ లేని మనుషులు. మరికొందరైతే దేవుడు ఇచ్చిన బిడ్డను దేవుడే చూసుకుంటాడు అనే సాకుతో ఆలయ మెట్లపై వదిలి వెళ్తున్నారు. ఇలాంటి ఘటనే ఇప్పుడు యాదాద్రి జిల్లా బీబీనగర్లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే..
యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమవారం గ్రామంలో శిశువు పదిలివేతకు సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన ఆడ పసికందును గ్రామంలోని శ్రీ లింగ బసవేశ్వర ఆలయం సమీపంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఆలయానికి వచ్చిన స్థానికులు పసికందు ఏడుపు విని గమనించి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు.
ఈ విషయం స్థానిక పోలీసులకు చేరడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు శిశువును సురక్షితంగా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యలు శిశువుకు తక్షణ చికిత్స అందించి ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. శిశువును వదిలిన వారెవరో గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టారు.
ALSO READ: Viral Video: సీటు కోసం బస్సులో రచ్చ రచ్చ.. జుట్టు పట్టుకుని కొట్లాడుకున్న వీడియో మీరూ చూసేయండి!