Chemical Drum Explosion: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దోతిగూడెంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక విజయసాయి కెమికల్ ల్యాబ్లో కెమికల్ మిక్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ధార పవన్ (30) అనే కెమిస్ట్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. మధ్యాహ్నం లంచ్ సమయంలో ఈ ప్రమాదం జరగడంతో మిగిలిన కార్మికులు బయట ఉన్నారు. దీనివల్ల పెను ప్రాణనష్టం తప్పిందని చెప్పవచ్చు. ఘటన జరిగిన సమయంలో పవన్ ఒక్కడే అక్కడ ఉండటం వల్ల అతడిని రక్షించే అవకాశం ఎవరికీ చిక్కలేదు.
ప్రమాదానికి సంబంధించిన వివరాలను కంపెనీ యాజమాన్యం మొదట గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసింది. సాధారణ అగ్ని ప్రమాదం వల్ల మంటలు చెలరేగాయని నమ్మబలికే ప్రయత్నం చేసినప్పటికీ సిసి టీవీ (CCTV) ఫుటేజీ అసలు నిజాన్ని బయటపెట్టింది. పవన్ కెమికల్ డ్రమ్ను తెరిచి ఒక రాడ్తో బలంగా మిక్స్ చేస్తున్న క్రమంలో రాపిడి కలిగి మంటలు ఎగసిపడ్డాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు ల్యాబ్ మొత్తం వ్యాపించాయి. పవన్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అవుతున్న దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. మంటల ధాటికి కెమికల్ అంతా ల్యాబ్ బయటకు ప్రవహించింది.
మృతుడు పవన్ గత ఐదేళ్లుగా ఇదే కంపెనీలో కెమిస్ట్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య.. ఒక చిన్న పాప ఉన్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం ఇంటికి వెళ్లి లంచ్ చేసే పవన్.. ఆరోజు పని ముగించుకుని మరో 15 నిమిషాల్లో బయటకు వస్తాడనగా ఈ ఘోరం జరిగిపోయింది. సమాచారం అందుకున్న భార్య ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తన భర్తను మృత్యువు కబళించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. కంపెనీ నాలుగో బ్లాక్లో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు గుర్తించారు.
సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్లు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. లేనిపక్షంలో మంటలు పక్కనే ఉన్న రియాక్టర్లకు వ్యాపించి భారీ పేలుళ్లు సంభవించే అవకాశం ఉండేది. వారం రోజుల క్రితం కూడా చౌటుప్పల్ పరిధిలోని మరో ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి కార్మికులు గాయపడ్డారు. వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఫార్మా కంపెనీల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పవన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై బాధితుడి కుటుంబ సభ్యులు.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠినమైన తనిఖీలు చేపట్టాలని పారిశ్రామిక భద్రతా విభాగం అధికారులను కోరుతున్నారు.
Read Also: TG High Court: సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన.. హైకోర్టులో మళ్లీ అదే రిపీట్