Telangana Bjp: తెలంగాణ బీజేపీలో నేతల మధ్య లుకలుకలకు ఫుల్స్టాప్ పడినట్టేనా? కేంద్రం పెద్దలతో నేతలంతా ఒకే తాటి మీదకు వచ్చారా? ఇంకా ఏమైనా ఉందా? పైకి చెప్పకున్నా.. లోలోపల కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారా? ఇదే సరైన సమయమని భావించిన తెలంగాణ బీజేపీ, పెండింగ్లో ఉన్న జిల్లా అధ్యక్షుల పదవులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణ బీజేపీలో కొంతకాలంగా మూడు జిల్లాల అధ్యక్షుల నియామకాలు పెండింగ్లో పడ్డాయి. నేతలంతా ఒకే తాటి మీదకు రావడంతో ఆ జిల్లాల అధ్యక్షుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చింది. అందులోని కరీంనగర్, వికారాబాద్, మేడ్చల్- అర్బన్ వంటి జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు వాటికి కొత్త అధ్యక్షులను నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు.
కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సాయి మల్లేశం, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రమేశ్, మేడ్చల్- అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా గిరివర్ధన్రెడ్డిలను నియమించారు. ఈ జిల్లాల అధ్యక్షుల ఎంపికపై కీలక నేతలు ఈటల రాజేందర్-బండి సంజయ్ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. తమ వర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇరునేతలు పట్టుబట్టినట్టు ప్రచారం సాగింది.
ఈ కారణం వల్ల ఆ నియామకాలను పార్టీ నాయకత్వం పెండింగ్లో పెట్టింది. ఇటీవల ఇరువురి నేతల మధ్య విస్తృత చర్చలు జరగడం, నేతలు సరేనని ఊ కొట్టినట్టు సమాచారం. అన్నివర్గాలకు ఆమోద యోగ్యమైన జిల్లాల అధ్యక్షుల పేర్లను ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. కొత్తగా లక్ష రేషన్ కార్డులు, మరో వారంరోజుల్లో..
కరీంనగర్ విషయంలో బండి సంజయ్ తన పట్టు నిరూపించుకున్నారని అంటున్నారు. మేడ్చల్ విషయంలో ఈటెల పతం నెట్టిందని అంటున్నారు. మొత్తానికి నేతలంతా ఒకేతాటి మీదకు రావడంతో ఆ మూడు పదవులు భర్తీ అయిపోయాయి. ప్రస్తుతానికి టీ బీజేపీలో మంచి వాతావరణ కనిపిస్తోందని అంటున్నారు కొందరు. ఇదే కంటిన్యూ అవుతుందా? లేదా అనేది చూడాలి.