TG High Court: సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు ఛార్జ్ షీట్ ను హైకోర్టు మరోసారి వెనక్కి పంపించింది. సమర్పించిన ఛార్జీ షీట్ లో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ వాటిని సరి చేసి మరోసారి సమర్పించాలని సూచించింది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో 2024, డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ షోకు హీరో అర్జున్ తోపాటు సినిమాలో నటించిన మరికొందరు నటులు వచ్చారు. అల్లు అర్జున్ వస్తున్నట్టుగా తెలియటంతో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకున్నారు. థియేటర్ లోపలికి వెళుతుండగా అభిమాన హీరోను దగ్గరగా చూడటానికి అభిమానులు ఒక్కసారిగా ముందుకు తోసుకు రావటంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
అల్లు అర్జున్ వెంట బౌన్సర్లు ఉన్నా తక్కువ సంఖ్యలోనే ఉండటంతో వాళ్లు జనాన్ని నియంత్రించ లేకపోయారు. దాంతో పోలీసులు పరిస్థితులను చక్కదిద్దటానికి లాఠీ ఛార్జీ జరిపారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పటికీ ఆ బాలుడు చికిత్స పొందుతున్నాడు.
జరిగిన సంఘటనపై కేసులు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు విచారణ జరిపారు. అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యం సహా మొత్తం 23మందిని కేసులో నిందితులుగా పేర్కొన్నారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే తొక్కిసలాట జరిగినట్టుగా నిర్ధారించిన పోలీసులు కోర్టుకు ఛార్జ్ షీట్ సమర్పించారు. అయితే, పోలీసులు కోర్టుకు ఇచ్చిన ఛార్జ్ షీట్ లో పలు లోపాలు ఉన్నాయని పేర్కొన్న హైకోర్టు దానిని వెనక్కి పంపించింది. సమగ్రంగా ఛార్జ్ షీట్ ను తయారు చేసి మరోసారి కోర్టుకు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.
Also Read: Mysuru Suicide: భర్త విదేశీ ట్రిప్కు తీసుకెళ్లలేదని.. ఆత్మహత్య చేసుకున్న భార్య
అయితే కొద్దికాలం క్రితమే పోలీసులు రెండోసారి ఛార్జ్ షీట్ ను హైకోర్టుకు సమర్పించారు. అయితే దీంట్లో కూడా లోపాలు ఉన్నట్టుగా హైకోర్టు గుర్తించింది. హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్ లు, సీడీలను ఛార్జ్ షీట్ కు జత చేయకపోవటంతో మరోసారి దానిని రిటర్న్ చేసింది. సమగ్ర వివరాలతో మరోసారి ఛార్జ్ షీట్ ను దాఖలు చేయాలని సూచించింది.
Also Read: Harish Rao: ఓవైపు యూరియా కష్టాలు.. మరోవైపు జల వివాదాలు.. హరీశ్ రావు ప్రశ్నల వర్షం