Football League: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ, అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో, స్పోర్ట్స్ ప్యాడాక్ సహకారంతో నిర్వహిస్తున్న యంగ్ తెలంగాణ ఫుట్బాల్ లీగ్ 2026-27 హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ సోనిబాలా దేవి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఫుట్బాల్ను గ్రామీణ స్థాయి నుంచి ప్రోత్సహించడం, చిన్నారులకు క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశాలు కల్పించడం లక్ష్యంగా యంగ్ తెలంగాణ ఫుట్బాల్ లీగ్ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ లీగ్ తెలంగాణలో బలమైన ఫుట్బాల్ సంస్కృతిని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, యువ క్రీడాకారులకు క్రమబద్ధమైన పోటీల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించడంతో పాటు ఉన్నత స్థాయికి ఎదిగే మార్గాన్ని కల్పిస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఫుట్బాల్ టోర్నమెంట్ మ్యాచ్లు
అండర్-12 బాలురు, బాలికల కోసం 5-ఏ-సైడ్ ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫుట్బాల్ అకాడమీలు, క్లబ్లకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ఎల్బీ స్టేడియం, పెట్రా స్పోర్ట్స్ క్లబ్, భైచుంగ్ భూటియా ఫుట్బాల్ స్కూల్స్, రీడ్స్ ఫుట్బాల్ అకాడమీ, జింఖానా ఫుట్బాల్ టీమ్, ఓఆర్ఓ ఎఫ్సీ జట్లు ఈ పోటీల్లో తలపడుతున్నాయి. టోర్నమెంట్ మ్యాచ్లు ఏఐఎఫ్ఎఫ్ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నాయి.
ఈ లీగ్లో ప్రధాన లక్ష్యం
వృత్తిపరమైన ప్రమాణాలు, నిబంధనలకు అనుగుణంగా పోటీలు కొనసాగుతున్నాయి. ఈ లీగ్ ప్రధాన లక్ష్యాల్లో ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించడం కూడా ఒకటి. టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఎల్బీ స్టేడియంలో ఫీఫా, ఏఐఎఫ్ఎఫ్ గుర్తింపు పొందిన కోచ్ల ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించే వీకెండ్ ఎలైట్ కోచింగ్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించబడుతుంది. ప్రారంభ కార్యక్రమానికి అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు విక్టర్ అమల్రాజ్ ముఖ్య అతిథిగా హాజరై, యువ ఫుట్బాల్ ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు.
క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యం
సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు జకీర్ హుస్సేన్, ఏడుకొండలు, జమీల్ షమీమ్, చంద్రశేఖర్తో పాటు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ సీనియర్ అధికారులు, డిప్యూటీ డైరెక్టర్లు పాల్గొని యువ ఆటగాళ్లను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఆటగాళ్లు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సమ్మర్ క్యాంప్ శిక్షణార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో ఎల్బీ స్టేడియం ప్రాంగణం సందడిగా మారింది. యంగ్ తెలంగాణ ఫుట్బాల్ లీగ్ వంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ రాష్ట్రంలో గ్రామీణ స్థాయి క్రీడాభివృద్ధికి మరింత బలాన్ని చేకూర్చడంతో పాటు, చిన్నారుల్లో శారీరక దృఢత్వాన్ని పెంపొందించి, భవిష్యత్తులో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది.
Also read: హైదరాబాద్లో జపాన్ బృందం ప్రత్యక్షం.. తెలంగాణ యువత, రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్!