Youth Congress: స్వేచ్ఛ బ్యూరో: దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలని యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ భాను చిబ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన అచ్చంపేట్ లో కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగిన మహా నిరసన ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి , నాగర్కర్నూల్ డీసీసీ అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
నీట్ పేపర్ లీకేజీ, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ ఎడ్లబండ్లతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయభాను చిబ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
ముఖ్యంగా విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.పదేపదే పరీక్షా పత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, ఇటీవల నీట్ పరీక్ష వ్యవహారంలో చోటుచేసుకున్న అవకతవకల కారణంగా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిర్లక్ష్య వైఖరి వల్ల దేశ విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసం దెబ్బతిన్నదని పేర్కొన్నారు.
అంతేకాకుండా సీబీఎస్ ఈ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకుంటున్న వరుస లోపాలు, పరిపాలనా వైఫల్యాలు కేంద్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడలేని ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల తరఫున పోరాటం కొనసాగిస్తోందన్నారు.దేశంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎవరూ అధైర్యపడవద్దని, వారి హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
Also Read: ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్