తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేక్రమంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీగా పిలుచుకుంటున్న దీనికి చైర్మన్గా ఒకరిని నియమించాలనే నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ప్రభుత్వ స్థలం కేటాయింపు హామీలో ప్రధానంగా ఉంది.
నెలకు పింఛన్ అందించే పథకంపై ఇంకా సర్కార్లో క్లారిటీ లేదు. ఉద్యమకారులు మాత్రం ప్రభుత్వ భూమిపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చేక్రమంలో ప్రభుత్వం ముందడుగు వేయనుందని, అందులో భాగంగా అర్హులను గుర్తించే క్రమంలో ఓ ప్రత్యేక కమిటీని కూడా వేయబోతున్నట్టు ప్రకటించారు.
బీఆరెస్ సర్కార్ ఏర్పడగానే ఈ ఉద్యమకారులకు పింఛన్, ఇంటి స్థలం హామీని నెరవేర్చాలని భావించారు. కానీ అది సాధ్యపడలేదు. నెలకు పదివేల పింఛన్ ఇస్తామన్నారు. ఆ తరువాత పదిహేను వేలకు దాన్ని పెంచుతామన్నారు. 250 గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామన్నారు. కానీ ఏదీ చేయలేదు. ఇది కేవలం ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. దీంతో ఉద్యమకారులకు ఆనాటి నుంచి కేసీఆర్ పై గుర్రుగానే ఉన్నారు. కేసీఆర్ ఇచ్చిన చాలా హామీల్లాగే ఉద్యమకారులకు ఇచ్చిన హామీ కూడా అటకెక్కినట్టేనని నిరాశ పడ్డారు.
కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో దీన్ని ప్రధాన హామీగా చేర్చింది. ఉద్యమకారుల్లో భరోసా కల్పించింది. 250 గజాల స్థలంతో పాటు 25వేల పింఛన్ కూడడా ఇస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి అర్హుల ఎంపిక విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ కాపీలు, జైలు జీవితానికి సంబంధించిన ఆధారాలను ప్రధానంగా అడిగింది. ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యమకారుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించింది. దీంతో ఉద్యమకారులకు కొంచెం నమ్మకం కలిగింది. దరఖాస్తు చేసుకున్న వారంతా .. పోలీస్ స్టేషన్ల నుంచి ఎఫ్ఐఆర్ కాపీలు తెచ్చి రెడీగా పెట్టుకున్నారు.
ప్రధానంగా జైలు జీవితం గడిపి వచ్చినవారిలో ఈ పథకం ఆశలు చిగురించేలా చేసింది. కానీ రెండేండ్లు ఆలస్యం కావడంతో ఉద్యమకారుల నుంచి కూడా ఒత్తిడి మొదలైంది. పార్టీలో కూడా అంతర్గతంగా ఈ హామీ అమలుపై చర్చ రావడంతో ఓ ప్రత్యేక కమిటీ వేసి అర్హుల గుర్తింపు, విధివిధానాలు, అమలు తీరుపై చర్చించాలని భావించింది. ఈ కమిటీకి చైర్మన్గా ఎవరిని నియమించాలనే ఆలోచన వచ్చినప్పుడు.. సర్కార్ ప్రధానంగా ముగ్గురి పేర్లను పరిశీలించాలని భావించింది.
ఇందులో తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ఉన్నారు. వీరిలో ఒకరిని కమిటీ చైర్మన్గా నియమించడం ద్వారా ఉద్యమకారుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న గందరగోళానికి బ్రేక్ వేసి.. హామీ అమలుకు సహకరిస్తారని సర్కార్ భావిస్తోంది. కొద్ది రోజుల్లోనే ఈ కమిటీ ఒకటి ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. ముగ్గురి పేర్లలో ప్రధానంగా కోదండరామ్ పేరును సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఉద్యమ జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరామ్కు ఉద్యమకారులతో సత్సంబంధాలుండటం, అర్హుల ఎంపికలో పారదర్శకత ఉంటుందనే నమ్మకం ఉద్యమకారులకు కలగనున్న నేపథ్యంలో ఆయన వైపే సీఎం ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. మరోవైపు ఈ నెలలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయశాంతి, కోదండరామ్, పొన్నం ప్రభాకర్ తదితరులు ఈ సభకు హాజరుకానున్నారు. ఆ లోపుగా ఈ కమిటీ ఏర్పాటు, చైర్మన్ నియామకం పూర్తి చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.