కేసీఆర్ దళిత వ్యతిరేకా? దళితుల అభ్యున్నతి ఆయనకు నచ్చదా? కీలక శాఖల్లో .. పదవుల్లో దళితులుంటే కేసీఆర్ సహించరా?? సీఎం రేవంత్రెడ్డి మాటల్లో అసలు మర్మమేమిటీ? అంబేద్కర్ జయంతి వేడుకల వేళ.. కేసీఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చింది..? ఇప్పుడు దీని గురించే మరోసారి చర్చ జరుగుతోంది. భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఈ సందర్బంగా చేసిన ప్రసంగం కలకలం రేపింది. పరోక్షంగా కేసీఆర్ను ఆయన దళిత వ్యతిరేకిగా అభివర్ణించారు. పదేళ్ల పాలనలో దళితులకు జరిగిన అవమానాన్ని ఆయన పరోక్షంగా మరోసారి గుర్తు చేశారు ఈ వేదికగా.
గద్దర్, అందెశ్రీల విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు.. అవమానకరంగా జరిగిన పాలనను గురించి ఆయన మరోసారి ఈ సందర్బంగా ప్రస్తావించడం చర్చకు తెరతీసింది. అన్నింటి కన్నా ముఖ్యంగా… దళితుడే స్పీకర్గా ఉన్నందున కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని సీఎం చేసిన ఆరోపణ.. దళిత వర్గంలోనే కాదు.. అన్ని వర్గాల్లో కూడా చర్చకు తావిచ్చింది. గతంలో కూడా రేవంత్ రెడ్డి ఈ మాటన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఆయన సూచించిన ప్రతీ సందర్బంలో ఆయన రాకపోవడానికి కారణం దళితుడైన గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్గా ఉండటమేనని కూడా స్పష్టం చేయడం కలకలం రేపింది.
తాజాగా మళ్లీ అవే మాటలు అంబేద్కర్ జయంతి వేడుకల వేళ సీఎం నోటి వెంట రావడం అటు బీఆరెస్ సర్కిళ్లలో కూడా చర్చకు తెరలేపినట్టయ్యింది. తెలంగాణ ఉద్యమ సమయంలో దళిత, బహుజనులే ప్రధాన పాత్ర పోషించారని చెప్పిన ఆయన… పదేళ్ల పాలనలో ఆయా వర్గాల వారికి న్యాయం జరగలేదని, విస్మరణకు గురయ్యారని, అవమానం పాలయ్యారని కూడా విమర్శించారు. తమ పాలనలో కీలక పదవులను, మంత్రిత్వ శాఖలను దళితులకు కేటాయించిన విషయాన్ని కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు సీఎం.
ఒక్కసారైనా కేసీఆర్.. సీఎం హోదాలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారా? అని ప్రశ్నించడం…అందరినీ ఆలోచనలో పడేసింది. రేవంత్ రెడ్డి ఇంకా ఏమన్నాడంటే..
పాటతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన గద్దరన్న పాత్రను మరిచిపోతారని ఎవరైనా అనుకుంటే అది వారి భ్రమే అన్నారు. పరోక్షంగా గద్దర్కు, ఆ తరువాత ఆ కుటుంబానికి కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన గౌరవ, గుర్తింపులను గుర్తు చేశారు. గద్దర్ పేరుతో సినీ అవార్డులను అందిచడంతో పాటు.. తెలంగాణ జాతిపితగా గద్దర్ పేరును సూచిస్తూ ఇటీవల మేథావులు, ఉద్యమకారులు ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటున్నది. పరిశీస్తున్నది.
ఈ నేపథ్యంలో గద్దర్ పేరును సీఎం ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాసిన అందేశ్రీ మనవాడు కాదా?… అని రేవంత్ అనడం వెనుక.. కేసీఆర్ ఆనాడు అందెశ్రీ రాసిన గీతాన్ని బయటకు రానీయకుండా చేసిన వైనాన్ని, ఆయనను అవమానించిన తీరును గుర్తు చేసినట్టయ్యింది. తాము అందెశ్రీక గీతాన్ని జాతీయ గీతంగా ప్రకటించామనే విషయాన్ని కూడా ఈ సందర్బంగా ఆయన తన ప్రసంగం ద్వారా తెలియజేశారు.
ఆనాటి పాలనతో పోలిస్తే ఈ ప్రజా ప్రభుత్వంలో దళితులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం …దళిత బిడ్డలు ఆర్ధిక మంత్రిగా ఉండొద్దా.. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండొద్దా…దళితులను అవమానపరిచిన వాళ్లను ఒకసారి మైక్ ఇవ్వండి అని దళితుడిని అడిగేలా చేసింది ఈ సర్కార్.. అని తమ పాలనకు, పదేళ్ల పాలనకు తేడాను వివరిస్తూనే.. దళితుల అభ్యున్నతికి పాటుపడటం, వారికి విలువనిచ్చే విషయంలో పోలికలను తన ప్రసంగంలో సూటిగా, పరోక్షంగా సీఎం తెలియజేసినట్టయ్యింది.