చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలన్నారు. ఇప్పుడు అచ్చంగా కాంగ్రెస్ అదే చేస్తున్నది. ఆ పార్టీ సీనియర్ నేత జీవన్రెడ్డి బీఆరెస్లో చేరడాన్ని సీరియస్గానే తీసుకున్నది. ఆయన పార్టీని వీడిన తరువాత అధిష్టానం దీనిపై లోతుగా చర్చించినట్టు తెలిసింది. కాంగ్రెస్ సోషల్ మీడియా, కొంత మంది ఆ పార్టీ సానుభూతి పరులు జీవన్రెడ్డి నిర్ణయంపై సెటైర్లు, విమర్శలు చేస్తున్నా.. సీనియర్లు మాత్రం ఇది బాధాకరమంటూ సానుభూతిని చూపడం చర్చకు వచ్చింది.
దీంతో జీవన్రెడ్డి పార్టీ వీడటం వల్ల జరిగబోయే నష్టాన్ని అంచనా వేయడంతో పాటు… వెంటనే దాని నివారణకు కూడా సిద్దమైంది కాంగ్రెస్ అధిష్టానం. దీని ద్వారా ఇంకా వలసలు పోకుండా నివారించడంతో పాటు, పార్టీ శ్రేణుల్లో భరోసా నింపి, పార్టీ, ప్రభుత్వ పాలనపై ఉన్న ప్రజాధరణను వివరించి చెప్పడం ద్వారా ఆత్మ విశ్వాసం పెంచాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ను రంగంలోకి దింపారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీభవన్లో ఆయన ఇవాళ ప్రెస్మీట్ పెట్టారు. ఇది వరకే ఆయన జీవన్రెడ్డి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తు ఓ ప్రెస్మీట్ పెట్టారు.
ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేయలేదని, 14 సార్లు బీ ఫామ్ ఇచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా ఆయన జీవన్రెడ్డిని విమర్శించడాన్ని తగ్గించి.. బీఆరెస్ పాలన జరిగిన విధానాలపై దుమ్మెత్తిపోశారు. దీంతో పాటు కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజాధరణ, అభివృద్ధి ఫలాలపై ఫోకస్ పెట్టారు. గతంలో ఇవి పలు వేదికల మీద చెప్పి ఉన్నా.. ఈ తరుణంలో మళ్లీ పీపీసీ చీఫ్ ప్రధానంగా ఈ రెండు పార్టీల పాలనలపై వివరించి, లోతుగా చెప్పడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
జీవన్రెడ్డి తమ పార్టీలో చేరడాన్ని గొప్పగా చూస్తున్నది బీఆరెస్. దీన్ని అదే విధంగా ప్రజెంట్ చేసుకుంటున్నారు కూడా. ఈ ఒక్క చేరిక ఇంకా చాలా చేరికలకు మూలం కావాలని అది భావిస్తోంది. అందుకే తమ దూకుడును పెంచేందుకు సిద్దమైంది అది. దీన్ని గ్రహించిన కాంగ్రెస్ కూడా దీనికి ఆదిలోనే బ్రేకులు వేయాలని డిసైడ్ అయ్యింది. అందుకే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు.
ఆ కుటుంబ రాజకీయాలపై విమర్శలు గుప్పించారు. బావబామ్మర్దులు ఓ వైపు, చెల్లె ఓ వైపు దోచుకుతిన్నారని తీవ్ర విమర్శలు చేశారు. 8 లక్షల కోట్లు అప్పు చేసి జనాన్ని ఆగం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ అవినీతి పాలనకు పెద్ద ఉదాహరణ అన్నారు. హరీశ్, కేసీఆర్ల అవినీతి వల్లే కాళేశ్వరం పరిస్థితి అలా అయ్యిందని విమర్శించారు మహేశ్. కేటీఆర్, హరీశ్లు కుర్చీ కోసం కొట్టాడుతున్నారని కూడా ధ్వజమెత్తారు. ఆ పార్టీలోనే ఐక్యత లేదు.. ఎవరికి వారే యమునా తీరేగా అధికారం కోసం, ఆస్తుల కోసం కొట్లాడుతున్నారనే సంకేతమివ్వడం ద్వారా బీఆరెస్ ఎదిగే చాన్సు లేదు అనే అర్థం వచ్చేలా ఆయన పరోక్షంగా కామెంట్లు చేశారు.
అదే సమయంలో డీలిమిటేషన్ ప్రక్రియ నేపథ్యంలో వంద సీట్లు తగ్గకుండా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేయడం ద్వారా పార్టీ క్యాడర్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు మహేశ్. కాంగ్రెస్కు మంచి భవిష్యత్తు ఉందనే విషయాన్ని మరోసారి తన మాటల ద్వారా పార్టీ శ్రేణులకు గుర్తు చేస్తూనే, అభివృధ్ధి, సంక్షేమమే ధ్యేయంగా రెండు కళ్ల సిద్దాంతంతో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కేసీఆర్ పాలనపై తమకంటే ఎక్కువ జీవన్రెడ్డే గట్టిగా ప్రజల ముందు నిలదీశారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మహేశ్ చెబుతున్నారు. అంతటి అవినీతి గల పార్టీలోకి మీరు వెళ్లడం పెద్ద తప్పని కూడా అభివర్ణించడంతో పాటు.. జీవన్ మీద గౌరవం ఉందనే విషయాన్ని కూడా చెబుతూ వస్తున్నారు. జీవన్రెడ్డి విమర్శను హుందాగా విమర్శిస్తూనే.. ఆ పార్టీలో చేరడాన్ని ప్రజలు హర్షించడం లేదనే విషయాన్ని కూడా ప్రొజెక్టు చేస్తున్నారు టీపీసీసీ చీఫ్.