Historic Railway: ఈ రోజుల్లో విమానం దిగగానే ఏ నగరానికైనా క్షణాల్లో చేరుకుంటున్నారు. కానీ, ఒకప్పుడు మన దేశంలో అడుగుపెట్టాలన్నా, ప్రముఖ నగరాలకు వెళ్లాలన్నా రైలు ప్రయాణమే ఏకైక మార్గం. ఆ కాలంలో బ్రిటిష్ పాలకులు నిర్మించిన రైల్వే స్టేషన్లు కేవలం ప్రయాణికుల కోసం మాత్రమే కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. వారు తమ సామ్రాజ్య పునాదులను, నిర్మాణ శైలిని చాటుకోవడానికి ప్రతీకలుగా వీటిని ఏర్పాటు చేశారు. అయితే స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచినా నేటికీ ఆనాటి వైభవాన్ని, చారిత్రక ప్రాధాన్యాన్ని కాపాడుకుంటూ భారత్కు గర్వకారణంగా నిలిచిన 7 ప్రముఖ రైల్వే స్టేషన్ల గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
భారతీయ రైల్వే నిర్మాణాలకు మకుటం లేని మహారాజుగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (పాత పేరు విక్టోరియా టెర్మినస్) నిలుస్తుంది. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఫెడరిక్ విలియమ్ స్టీవెన్స్.. 1878 – 1888 మధ్య కాలంలో దీనిని నిర్మించారు. ఈ కట్టడం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా సైతం గుర్తింపు పొందింది. ఇప్పటికీ ఇది ముంబై నగర ప్రయాణాలకు ప్రధాన గుండెకాయలా పనిచేస్తోంది.
హుగ్లీ నది ఒడ్డున ఎర్రటి ఇటుకల నిర్మాణంతో కనువిందు చేసే హౌరా స్టేషన్.. మన దేశంలోనే అతిపురాతనమైనది. 1854లోనే ఇక్కడి నుండి మొదటి రైలు ప్రయాణం ప్రారంభమైంది. అప్పట్లో బ్రిటిష్ ఇండియా రాజధానిగా ఉన్న కోల్కతా విస్తరణలో భాగంగా ఈ స్టేషన్ను మరింత వైభవంగా తీర్చిదిద్దారు. 23 ప్లాట్ఫారమ్లతో దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే హౌరా స్టేషన్ కు వెళ్తే.. ఇప్పటికీ ఒక అద్భుతమైన అనుభూతి కలుగకమానదు.
బ్రిటిష్ పాలకులు తమ వేసవి రాజధాని అయిన సిమ్లాకు చేరుకోవడానికి 1903లో ఈ ప్రత్యేకమైన నారోగేజ్ రైలు మార్గాన్ని ప్రారంభించారు. పర్వతాలను నడుమ 96 కిలోమీటర్ల మేర సొరంగాలు, రాతి వంతెనల గుండా సాగే ఈ ప్రయాణం ఆనాటి ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం. పచ్చని పైన్ అడవుల గుండా సాగే ఈ ‘టాయ్ ట్రెయిన్’ ప్రయాణం నేటికీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
డార్జిలింగ్ కొండల్లో సముద్రమట్టానికి దాదాపు 2,258 మీటర్ల (7,407 అడుగుల) ఎత్తులో ఉన్న ఘూమ్ స్టేషన్ భారత్లోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్గా పేరుగాంచింది. తేయాకు తోటలను, దిగువ ప్రాంతాలను కనెక్ట్ చేసేలా 19వ శతాబ్దం చివర్లో దీనిని నిర్మించారు. ఇక్కడి పొగమంచు, పాతకాలపు స్టీమ్ ఇంజన్లు, వారసత్వ మ్యూజియం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయి.
దీనిని చూడగానే రైల్వే స్టేషనా లేక రాజప్రసాదమా అనే సందేహం కలగక మానదు. 1914-1920 మధ్య కాలంలో జేహెచ్ హోర్నిమాన్ దీనిని రూపొందించారు. ఈ భవనంలో బ్రిటిష్, మొఘల్, రాజస్థానీ శైలులు ఆకట్టుకుంటాయి. లక్నో నగరానికి వచ్చే ప్రయాణికులకు రాచరిక అనుభూతిని పంచేలా నిర్మించిన ఈ స్టేషన్.. ఉత్తర భారతదేశ రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది.
దక్షిణ భారతదేశానికి ప్రధాన ద్వారంగా నిలిచే చెన్నై సెంట్రల్ స్టేషన్.. 1873 నుండి సేవలు అందిస్తోంది. విక్టోరియన్, గొథిక్ శైలుల్లో నిర్మించిన ఇక్కడి ఎత్తైన గడియార స్తంభం.. చెన్నై నగరానికే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దక్షిణాది నగరాలను అనుసంధానించడంలో ఈ స్టేషన్ చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది.
Also Read: ఇంగువలో నాణ్యతా లోపాలు.. ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఉత్పత్తులపై FSSAI నిషేధం!
ఎర్రకోట, చాందినీ చౌక్ సమీపంలో ఉండే ఓల్డ్ ఢిల్లీ స్టేషన్ నిర్మాణం.. 1903లో ప్రారంభమైంది. సమీపంలోని ఎర్రకోట రూపురేఖలను ప్రతిబింబించేలా ఎర్రటి ఇసుకరాతి శైలిలో దీనిని తీర్చిదిద్దారు. 1926లో న్యూఢిల్లీ స్టేషన్ రాకముందు వరకు రాజధానికి ఇదే అతిపెద్ద రైల్వే కేంద్రంగా ఉండేది. మెుత్తంగా చూస్తే.. కాలం మారినా, విమాన ప్రయాణాలు పెరిగినా.. శతాబ్దాల చరిత్రను తలపై మోస్తూ, కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న ఈ రైల్వే స్టేషన్లు.. భారతీయ రవాణా రంగానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
Also Read: మూడ్ వస్తే చాలు.. స్పాట్లోనే పెళ్లి.. నైట్ క్లబ్స్, మెట్రో, ఎయిర్ పోర్ట్స్ ఎక్కడైనా మీ ఇష్టం!