Air India Flight News: ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ చేసిన ఒక భారీ తప్పిదం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. సాంకేతిక కారణాల వల్ల కాకుండా.. కేవలం విమానం రకాన్ని గుర్తించడంలో జరిగిన పొరపాటు వల్ల వందలాది మంది ప్రయాణికులు ఎనిమిది గంటల పాటు గాలిలోనే గడపాల్సి వచ్చింది. గురువారం ఢిల్లీ నుంచి కెనడాలోని వాంకోవర్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. గమ్యస్థానానికి చేరకుండానే తిరిగి ఢిల్లీకి చేరుకోవడంతో విమానయాన రంగంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
నిబంధనల ప్రకారం ఢిల్లీ నుండి కెనడాకు ప్రయాణించడానికి ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 777-300 ER విమానానికి మాత్రమే అనుమతి ఉంది. అయితే పొరపాటున సిబ్బంది బోయింగ్ 777-200 LR విమానాన్ని వాంకోవర్ పంపేందుకు సిద్ధం చేశారు. విమానం ఢిల్లీ నుండి బయలుదేరిన సుమారు నాలుగు గంటల తర్వాత.. చైనాలోని కున్మింగ్ గగనతలం వద్దకు చేరుకున్న సమయంలో విమానయాన సంస్థ తన తప్పును గుర్తించింది. వాంకోవర్లో దిగడానికి ఈ విమానానికి సాంకేతిక అనుమతులు లేవని తెలుసుకున్న అధికారులు వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు.
మొత్తం ఎనిమిది గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత విమానం తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో సమయం వెచ్చించి.. గమ్యస్థానం చేరుకుంటామన్న ఆశతో ఉన్న ప్రయాణికులకు ఇది పెద్ద షాక్ అని చెప్పాలి. విమానయాన సంస్థ చేసిన ఈ నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు శారీరకంగా.. మానసికంగా ఇబ్బందులు పడ్డారు. ఎయిర్ ఇండియా వంటి అంతర్జాతీయ సంస్థ ఇంత చిన్న విషయాన్ని ఎలా విస్మరించిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అనుమతులు లేని విమానాన్ని అంతర్జాతీయ ప్రయాణానికి ఎలా అనుమతించారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఎయిర్ ఇండియా యాజమాన్యం ప్రయాణికులకు క్షమాపణలు చెప్పడమే కాకుండా.. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రకటించింది. ఈ తప్పిదానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Read Also: Zomato Fee Hike: ప్లాట్ ఫామ్ ఫీజు పెంచేసిన జొమాటో.. ఒక్కో ఆర్డర్ కు ఎంత కట్టాలంటే?